స్పెక్ట్రమ్ బకాయిలను ముందుగానే చెల్లించిన ఎయిర్‌టెల్!

by Disha Web Desk 17 |
స్పెక్ట్రమ్ బకాయిలను ముందుగానే చెల్లించిన ఎయిర్‌టెల్!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ స్పెక్ట్రమ్ బకాయిలకు సంబంధించి మరో రూ. 8,815 కోట్లను ప్రభుత్వానికి చెల్లించినట్టు వెల్లడించింది. 2015 నాటి వేలంలో పొందిన స్పెక్ట్రానికి సంబంధించి ఈ బకాయిని ఎయిర్‌టెల్ 2027, 2028 వరకు చెల్లించడానికి అవకాశం ఉన్నప్పటికీ ముందుగానే బకాయిలను కట్టేసినట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది మే-జూన్‌లో జరగబోయే 5g స్పెక్ట్రమ్ విక్రయంలో పాల్గొనడానికి కంపెనీ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వాయిదా వేసిన స్పెక్ట్రమ్ బకాయిలపై 10 శాతం వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు ముందుగానే చెల్లింపులను పూర్తిచేసినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌టెల్‌కు నగదు లభ్యత సులభమవుతుందని, 5జీ నెట్‌వర్క్ కోసం మెరుగైన సేవలందించవచ్చని తెలిపారు.

గతేడాది డిసెంబర్‌లో సైతం ఎయిర్‌టెల్ కంపెనీ 2014 వేలంలో కొన్న స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 15,519 కొట్లను ముందుగానే చెల్లించింది. దీంతో గడిచిన నాలుగు నెలల కాలంలో ఎయిర్‌టెల్ సంస్థ మొత్తం రూ. 24,334 కోట్ల బకాయిలను చెల్లించినట్టు అయింది. ఎయిర్‌టెల్ మూలధన వ్యయంపై దృష్టి సారిస్తోంది. దీనికోసం ఫైనాన్సింగ్ వ్యయాన్ని సానుకూలంగా ఉంచడం, స్పెక్ట్రమ్ బకాయిలను ముందుగానే చెల్లించి వడ్డీని ఆదా చేస్తోందని కంపెనీ వెల్లడించింది. కాగా, స్పెక్ట్రం బకాయిల చెల్లింపుల నేపథ్యంలో శుక్రవారం ఎయిర్‌టెల్ షేర్ ధర 0.7 శాతం పెరిగి రూ. 711.10 వద్ద ట్రేడింగ్ అయింది.



Next Story