Telangana :: ఐదేండ్లలో తెలంగాణ అప్పులు డబుల్.. సౌతిండియాలో టాప్..!

by Disha Web Desk 2 |
Telangana :: ఐదేండ్లలో తెలంగాణ అప్పులు డబుల్.. సౌతిండియాలో టాప్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, అప్పుల కుప్పగా మార్చారని విపక్షాలన్నీ మూకుమ్మడిగా విమర్శిస్తున్నాయి. అప్పు చేసి పప్పు కూడు తరహాలో ఎడాపెడా అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో ఖర్చు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. విపక్షాల నోటికి తాళం వేసేలా బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం విపక్షాల ఆరోపణలు నిజమేననే తీరులో వెల్లడైంది.

సౌతిండియాలో టాప్..

సెకండ్ టర్ములో (2019 మార్చి నాటికి) రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ద్వారా తీసుకున్న అప్పుల భారం రూ. 1.90లక్షల కోట్లుగా ఉన్నదని, 2023-24 ఆర్థిక సంవత్సరం ఎస్టిమేట్స్ ప్రకారం అది రూ. 3.66 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆమె వివరించారు. కర్ణాటక అప్పు సైతం రూ. 2.86 లక్షల కోట్ల నుంచి రూ. 5.35 లక్షల కోట్లకు చేరుకున్నది. కానీ గతేడాదితో పోల్చినప్పుడు సౌతిండియా రాష్ట్రాల్లో తెలంగాణ 16.6శాతంతో టాప్ ప్లేస్‌లో ఉన్నది.

ఇవి రిజర్వ్ బ్యాంకు రుణాలే..

రాష్ట్ర జీఎస్‌డీపీని పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ సమాధానంలో వివరించింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల గురించి పూర్తి వివరాలను (రాష్ట్రాలవారీగా) వెల్లడించలేదు. నాబార్డు ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి సహాయక నిధి కింద అదనంగా మరో రూ. 8,463.18 కోట్లను తీసుకున్నది. ఇందులో రూ. 6,528.95 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 2019-2023 మధ్యకాలంలో తీసుకున్నది. ఈ ఐదేండ్లలో అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ప్రతీ ఆర్థిక సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం సగటున 18శాతం చొప్పున రుణం తీసుకుంటున్నది.

ఒడిశా మాత్రమే నెగెటివ్..

దేశం మొత్తం మీద ఒడిశా రాష్ట్రం మాత్రమే వరుసగా మూడేండ్లుగా అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే తక్కువ రుణం తీసుకుంటూ నెగెటివ్‌లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చినా తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదేండ్లలో ఎక్కువ అప్పే తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణ భారం 2019లో రూ. 2.64 లక్షల కోట్లు ఉంటే 2023-24 అంచనా లెక్కలతో అది వచ్చే ఏడాది మార్చి నాటికి రూ. 4.42 లక్షల కోట్లకు చేరుకోనున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ అటు రిజర్వు బ్యాంకు నుంచి ఎఫ్ఆర్‌బీఎం ప్రకారం తీసుకునే రుణాలతో పాటు కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రభుత్వ గ్యారంటీతో తీసుకునే అప్పులు దాదాపు 5.5 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా.

ఇందులో ప్రతీ సంవత్సరం వడ్డీల కోసమే వేలాది కోట్ల రూపాయలను చెల్లిస్తూ ఉన్నది. గతేడాది సుమారు రూ. 18 వేల కోట్లు కేవలం వడ్డీలకు చెల్లించనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంటే ఈసారి అది రూ. 22 వేల కోట్లకు పెరిగింది. దీనికి తోడు ఈ సంవత్సరం నుంచి కాళేశ్వరం, మిషన్ భగీరథ రుణాల రీపేమెంట్ కూడా మొదలైంది. సుమారు రూ. 12 వేల కోట్లను చెల్లించాల్సి వస్తుందని బడ్జెట్‌లో లెక్కలు వేసుకున్నది. దేశం మొత్తం మీద గతేడాది కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం రాజస్థాన్ (17.2%) కాగా ఆ తర్వాతి స్థానం తెలంగాణ (16.6%) రాష్ట్రానిదే. ఐదేండ్లలో తీసుకున్న రుణాలతో ఔట్‌స్టాండింగ్ బారోయింగ్‌ వివరాలు, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పెరిగిన అప్పు శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :: బీసీల్లో 15 కులాలకే రూ.లక్ష సాయం.. ప్రధాన కొలమానం అదే!



Next Story