KCR ఆలోచనలకు అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి: గౌరీశంకర్

by Disha Web Desk 19 |
KCR ఆలోచనలకు అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి: గౌరీశంకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు భాషా అమలుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో మంగళవారం కవులు, రచయితల సమ్మేళం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

మాతృభాషా పరిరక్షణలో భాగంగా అకాడమీ ఆధ్వర్యంలో మన ఊరు- మన చెట్లు అన్న కథల పోటీలు నిర్వహిస్తే అందులో 5లక్షల మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. తెలుగు పరిరక్షణ కోసం అకాడమీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. సాహిత్య, సంస్కృతిక సౌరభాలు గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విరజిల్లుతున్నాయో మనఊరు-మన చరిత్ర ద్వారా విద్యార్థులు పదిల పరుస్తున్నారన్నారు. తెలుగుభాష అమలుకు పాఠశాల స్థాయి నుంచే పునాదులు బలంగా పడుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. మాతృభాషను బతికించుకునే పని మన ఇంటి నుంచే మొదలు కావాలన్నారు. తెలుగు మాధ్యమంలో ఉన్న టీవీ ఛానళ్లలో సులభమైన తెలుగు పదాలు వాడాలన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.

తెలంగాణ సాహితీ సంస్థ కార్యదర్శి ఆనందాచారి మాట్లాడుతూ.. మనం మనుషులుగా బతికితేనే భాష కూడా సజీవంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్. బాలాచారి, కవయిత్రి జ్వలిత, సలీమా, రూప్ కుమార్ డబ్బికార్, శ్రీరాములు, సుందరయ్య, చక్రవర్తి, షెహనాజ్ భేగం, నారాయణశర్మ, వెంకటేశ్వరరెడ్డి, అశోక్ కుమార్, మోహనకృష్ణ, శరత్ సుదర్శి, రేఖ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed