చైర్మన్‌ వైదొలగాలని బెదిరించడం ధిక్కరణే.. ఇంకా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు: కేంద్ర మంత్రి బండి

by Mahesh |
చైర్మన్‌ వైదొలగాలని బెదిరించడం ధిక్కరణే.. ఇంకా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు: కేంద్ర మంత్రి బండి
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహారెడ్డిని అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని, చట్టబద్ధంగా నియమించిన కమిషన్ నే తప్పుపట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేసీఆర్ పై శనివారం ఒక ప్రకటనలో ఘాటు విమర్శలు చేశారు. చట్టబద్ధంగా నియమించిన కమిషన్ కు గౌరవం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం సిగ్గుచేటని విమర్శలు చేశారు. కమిషన్ ఎదుట వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్.. ఆ కమిషన్ నే అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఛీ కొట్టి ఓడించినా కేసీఆర్ లో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న కేసీఆర్ వాదనలో పస ఉంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్లలేదని బండి ప్రశ్నించారు.

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) నిర్ణయాలను జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదని, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, దాని ఆధారంగా జరిగిన అనేక అవినీతి, అక్రమాలపైనే విచారణ జరుపుతోందే తప్ప ఈఆర్సీ పై కాదని వివరించారు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గుచేటని విమర్శలు చేశారు. కేసీఆర్ తన లేఖలో తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పేర్కొనడం దుర్మార్గమైన చర్య అంటూ ధ్వజమెత్తారు. నర్సింహారెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టే ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కేంద్రానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పంపిన రహస్య నివేదికను బహిరంగ పర్చాలని ఆదేశాలు జారీచేసి ఆ కమిటీలోని 8వ ఛాప్టర్ అంశాలను బట్టబయలు చేయించిన ధైర్యశాలి జస్టిస్ నర్సింహారెడ్డి అని కొనియాడారు.

తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉంటూ పోరాడిన ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు బయటకు రాకుండా వర్శిటీ గేటు ఎదుట ముళ్ల కంచెలు వేసి నిర్భందిస్తే.. ముళ్ల కంచెను తీసివేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. చేసిన తప్పులను, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎందాకైనా వెళతారని, ఏ స్థాయి వ్యక్తుల ప్రతిష్టనైనా దెబ్బతీసేందుకు వెనుకాడరనేదానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా బండి చెప్పుకొచ్చారు. ఆనాడు ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా ప్రెస్ మీట్ నిర్వహించి న్యాయస్థానాలను ప్రభావితం చేసేందుకు ఇదే తరహాలో ఎదురుదాడి చేసి బీజేపీపై అభాండాలు మోపి రాజకీయ లబ్డిపొందాలనుకుని భావిస్తే.. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా? అంటూ అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టిన సంగతి కేసీఆర్ మర్చిపోయినట్లున్నారని సంజయ్ చురకలంటించారు.

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, అవినీతి జరిగాయనేది బహిరంగ రహస్యమని, కేసీఆర్ తప్పు చేయలేదని భావిస్తే నర్సింహారెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తే సరిపోయేదని, కానీ అందుకు భిన్నంగా కమిషన్ నియామకాన్ని తప్పుపట్టడం, కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలని నర్సింహారెడ్డికి సూచించడం దారుణమన్నారు. ఇది ముమ్మాటికీ ధిక్కరణ కిందకే వస్తుందని, తక్షణమే కేసీఆర్ ని అరెస్ట్ చేసి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని కేంద్ర మంత్రి సంజయ్ డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం తో పాటు కాళేశ్వరం, గొర్రెల పంపిణీ అక్రమాలపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.

కేసీఆర్ తో పాటు అప్పటి మంత్రులు, అధికారులు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే విషయంలో ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ బాధ్యులను అరెస్టు చేయకపోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటో తెలపాలని డిమాండ్ చేశారు. కమిషన్ చైర్మన్ ను తప్పుకోవాలని బెదిరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేసీఆర్ తో సహా అవినీతికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి వాస్తవాలను ప్రజల ముందుంచి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story