ఈ మతిలేని చర్య వల్ల కొలువులు రాకుండా పోయే ప్రమాదం!.. కేటీఆర్ సంచలన ట్వీట్

by Ramesh Goud |
ఈ మతిలేని చర్య వల్ల కొలువులు రాకుండా పోయే ప్రమాదం!.. కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల భూములు తాకట్టు అని ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనంపై ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. కాంగ్రెస్ సర్కార్ పై పలు విమర్శలు చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం అని అన్నారు. అలాగే దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయని తెలిపారు.

ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉన్నది! అని మండిపడ్డారు. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని పేర్కొన్నారు. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉండి, కొత్తగా పెట్టుబడులు రావడం లేదని, ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారని, కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి ఎక్స్ ద్వారా ప్రశ్నించారు.

Advertisement

Next Story