తెలంగాణలో గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు

by Disha Web Desk 2 |
తెలంగాణలో గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారైంది. జూన్ 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు సోమవారం TSPSC అధికారిక ప్రకటన చేసింది. ఇటీవల గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి 27 సాయంత్రం 5గంటల వరకు సరిచేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

కాగా, గతంలో పలుమార్లు గ్రూపు-1 ప్రశ్నాపత్రాలు లీకైన కారణంగా పరీక్షలు రద్దు అవుతూ వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఉండేందుకు ఏకంగా మొత్తం టీఎస్‌పీఎస్‌సీ బోర్డునే తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. బోర్డు చైర్మన్‌తో పాటు సభ్యులను అందరినీ మార్చింది. ఇక నుంచి టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ బోర్డు చైర్మన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.


Next Story