పోలీసులపై రోహిత్ వేముల తల్లి రాధిక సీరియస్

by Disha Web Desk 2 |
పోలీసులపై రోహిత్ వేముల తల్లి రాధిక సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసులపై రోహిత్ వేముల తల్లి రాధిక తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద శనివారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోహిత్‌కు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. విచారణలో కొందరు పోలీసులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. చదవలేక రోహిత్ సూసైడ్ చేసుకున్నాడని అనడం సరైంది కాదని తెలిపారు. అసలు రోహిత్ ఎస్సీ కాదని పోలీసులు ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నించారు. అతను ఎస్సీనో కాదో తేల్చాల్సింది రెవెన్యూ యంత్రాంగం అని చెప్పారు.

తాము కలిసి రిక్వెస్ట్ చేయగానే కేసు రీఓపెన్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. అప్పటి హెచ్‌సీయూ వీసీతోపాటు పలువురు బీజేపీ నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని రాధిక డిమాండ్ చేశారు. కాగా, 2016లో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసు విషయం మళ్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అతను దళితుడే కాదని పోలీసులు రిపోర్ట్ ఇవ్వడంతో HCUలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయ్‌. దాంతో, రోహిత్‌ వేముల ఆత్మహత్యపై మరోసారి దుమారం రేగింది. దీంతో రోహిత్ వేముల కేసును రీఓపెన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. పునర్విచారణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Next Story