నిజామాబాద్ పార్లమెంట్ బరిలో 42 మంది అభ్యర్థులు

by Disha Web Desk 15 |
నిజామాబాద్ పార్లమెంట్ బరిలో 42 మంది అభ్యర్థులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉండేందుకు చాలా మంది పోటీ పడ్డారు. ఐదేళ్లకోసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తమ లక్ ను పరీక్షించుకునేందుకు పార్టీలకతీతంగా బరిలో నిల్చునేందుకు ఆసక్తి చూపారు. 18వ నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల కోసం అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు పోటీ పడ్డారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా 17 లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. ఈనెల 19న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం వరకు జరిగింది.

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే కాకుండా ఆదిలాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. 42 మంది మొత్తం 90 నామినేషన్లు సమర్పించారని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి రోజైన గురువారం నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి 28 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే...

రాపెల్లి సత్యనారాయణ (స్వతంత్ర), భూక్యా నందు (విద్యార్థి రాజకీయ పార్టీ), రాగి అనిల్ (స్వతంత్ర), గోవర్థన్ బాజిరెడ్డి (బీఆర్ఎస్), రాపెల్లి శ్రీనివాస్ (స్వతంత్ర), కండెల సుమన్ (ధర్మ సమాజ్ పార్టీ), అరవింద్ ధర్మపురి (బీజేపీ), దేవత్ శ్రీనివాస్ (బహుజన ముక్త్ పార్టీ), ఆరె రాజేందర్ (స్వతంత్ర), గంట చరితా రావు (స్వతంత్ర), సయ్యద్ అస్గర్ (2 సెట్లు), మిర్యాలకర్ జయప్రకాశ్ (స్వతంత్ర), యుగంధర్ గట్ల ( అలయెన్స్ ఆఫ్​ డెమోక్రటిక్ రిపార్మ్ పార్టీ), పోతు అశోక్ ( మన తెలంగాణ రాష్ర్ట సమాఖ్య పార్టీ ), విఠల్ మాలావత్ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ), కాట్రాజి ప్రశాంత్ ( ఇండిపెండెంట్), కోటగిరి శ్రీనివాస్ (స్వతంత్ర), కొత్తకొండ శక్తిప్రసాద్ (స్వతంత్ర), బీ.బీ.నాయక్ (స్వతంత్ర),

మొహమ్మద్ జమీల్ (స్వతంత్ర), అశోక్ గౌడ్ (బహుజన లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్ ( ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), సాయికృష్ణ మూర్తి (యుగ తులసీ పార్టీ), పోతు నాగార్జున ( ప్రజా సేన పార్టీ), గోలి నరేష్ (స్వతంత్ర), ఎండీ.షాహెద్ ఖాన్ (స్వతంత్ర), కొండూరు గంగాధర్, పానుగంటి రజితావాణి (పిరమిడ్ పార్టీ ఆఫ్​ ఇండియా), ముత్యం రఘు ( ఇండిపెండెంట్), తాటిపర్తి జీవన్ రెడ్డి (కాంగ్రెస్), చెంచుల అశోక్ (స్వతంత్ర), దేశబోయిన లక్ష్మీనారాయణ ( స్వతంత్ర), మొగిలి రాజ్ కుమార్ (స్వతంత్ర), పాలమూరు సాయినిఖిల్ ( స్వతంత్ర), మహమ్మద్ మన్సూర్ అలీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), వేముల విక్రమ్ రెడ్డి (స్వతంత్ర), పుప్పాల లింబాద్రి (స్వతంత్ర), బేగరి పోశం (రాష్ట్రీయ మానవ్ పార్టీ), తూటుకూరి జీవన్ రెడ్డి (స్వతంత్ర), గోపి చంద్రయ్య (స్వతంత్ర), మీసాల శ్రీనివాస్ రావు (బీజేపీ రెబల్), వి.మహాతేజ (స్వతంత్ర) నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కోసం ప్రధాన రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు బీఆర్ఎస్, బీఎస్పీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యుగ తులసీ పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్​ ఇండియాతో పాటు పలు ఎన్నికల కమిషన్ గుర్తింపు లేని ప్రాంతీయ పార్టీలతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు. 2019 లో 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఆనాడు నిజామాబాద్ పార్లమెంట్ కొత్త రికార్డులు నమోదు చేసింది. ఎన్నికల నిర్వహణతో పాటు గెలుపు ఓటములు ఆనాడు దేశం మొత్తం చర్చనీయాంశమైంది. ఈసారి నామినేషషన్ ల ప్రక్రియ నాటికి 42 మంది బరిలో ఉండటంతో అందులో పెద్ధ మొత్తంలో స్వతంత్రులు ఉండటం ప్రధాన పార్టీలను

కలవరపెడుతుంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటీ అని అందరూ అంచనాలు వేస్తుండగా స్వతంత్రులు బరిలో ఉండటంతో ఎవరి ఓటు బ్యాంక్ కు గండిపడుతుందో అని అంతటా చర్చ జరగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు అదే పార్టీల అభ్యర్ధులు పోటీలో ఉండగా బీఫారం ఇచ్చిన వారు అభ్యర్థులుగా, మిగిలిన వారు స్వతంత్రులుగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలకు రెబల్ బెడద తప్పేలా లేదు. అదే సమయంలో వారు చీల్చే ఓట్లు ఏ మేరకు ప్రభావితం చేస్తాయనే భయం ప్రధాన రాజకీయ పార్టీలకు ఉంది. అయితే నామినేషన్ లను ఉపసంహరించుకోవడానికి సమయం ఉండటంతో వారిని బుజ్జ గించి లేదా నచ్చ చేప్పడమే చేసి ప్రధాన పక్షాలు వారిని దారిలోకి తెచ్చుకుని నామినేషన్ విత్ డ్రాలకు ప్రయత్నాలు ప్రారంభించనున్నాయి. నామినేషన్ లు విత్ డ్రా చేయించేందుకు ఎంపీ అభ్యర్థులు కాచుకు కూర్చున్నారు.



Next Story

Most Viewed