పండగపూట రైతులకు మంత్రి కోమటిరెడ్డి శుభవార్త

by Disha Web Desk 2 |
పండగపూట రైతులకు మంత్రి కోమటిరెడ్డి శుభవార్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణాలతో ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. అలైన్ మెంట్ మార్పునకు ఆలోచిస్తామన్నారు. సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం ఆర్ఆర్ఆర్‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజక వర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

పీర్లాపల్లి, ఇటిక్యాల, లింగారెడ్డి పల్లి, ఆలీరాజ్ పేట్, నర్సన్నపేట, చేబర్తి, పాతూరు, మక్తా మాసాన్ పల్లి, సామలపల్లి, నెంటూర్, బంగ్లవెంకటాపూర్, బెగంపేట్, ఎల్కంటి గ్రామాలకు చెందిన రైతులకు ఇటీవల ఆర్ఆర్ఆర్ నిర్మాణ భూసేకరణకు నోటీసులు వచ్చాయని, అయితే ఇప్పటికే తాము మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూనిర్వాసితులం అయ్యామని వివరించారు. మళ్లీ తమకు మిగిలిన కొద్దిపాటి భూములు ఆర్ఆర్ఆర్‌లో పోతే తామ జీవనాధారం కోల్పోతామని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమ పరిస్థితిని మానవతా ధృక్పథంతో పరిశీలించి ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చేందుకు చొరవ చూపాలని విన్నపించారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన ప్రాజెక్టు వల్ల ప్రజాధనం వృధా అవడమే కాకుండా రైతులు నిర్వాసితులుగా, బాధితులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాల వలన రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గత ప్రభుత్వంలా ఒంటెద్దు పోకడలు పోకుండా, తాము ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. రైతులు మాట్లాడుతూ.. గత పదేండ్లుగా తమ సమస్యలు చెప్పకుందామంటే ఏ మంత్రి కలిసేవారు కాదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కానీ ముందస్తు సమాచారం ఇవ్వకున్నా, మంత్రి కోమటిరెడ్డి పండగ వేడుకలను పక్కన పెట్టి తమ సమస్యను ఎంతో ఒపిగ్గా విన్నారని ఆనందం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed