అనుమతులు లేని పాఠశాలలు వందల్లో..

by Aamani |
అనుమతులు లేని పాఠశాలలు వందల్లో..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : విద్యాశాఖ అనుమతి లేకుండా వందల ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. వాటి యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్న అధికారులు.. ఏదైనా ఘటన వెలుగు చూస్తే తప్ప అనుమతుల విషయాన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర రాజధానిని అనుకుని ఉన్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేస్తే తప్ప విద్యాశాఖ స్పందించడం లేదు.ప్రజా సంఘాలు , తల్లిదండ్రులు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేస్తే ఇప్పటి వరకు విద్యాశాఖ కొన్నింటిని మూసివేసింది.అయితే ఇంకా వందల సంఖ్యలో అనుమతి లేకుండా.. ఉన్న ,గడువు ముగిసిన పాఠశాలలు వందల సంఖ్యలో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు.

సర్కారు ఆదాయానికి గండి..

అనుమతులు తీసుకుని కారణంగా సర్కారు ఆదాయానికి రూ.కోట్లలో గండిపపడడంతోపాటు.. విద్యార్థులకు సైతం నష్టం వాటిల్లుతోంది. ఆయా పాఠశాలలు ఇచ్చే టీసీలు చెల్లవు. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులు పదో తరగతికి వస్తే పరీక్ష ఫీజు చెల్లించడమూ సాధ్యం కాదు. అయితే జిల్లాలో కొన్ని ప్రైవేట్ , కార్పొరేట్ స్కూళ్లు అనుమతులు లేకుండానే ఆడ్మిషన్లు తీసుకుంటున్నాయి. కొన్ని పాఠశాలల అనుమతి గడువు ముగిసినా.. తిరిగి రెన్యువల్ చేసుకోవడంలేదు. శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ స్కూళ్లు ఒక చోట అనుమతి తీసుకొని మరోక చోట బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నాయి.నిర్మాణంలో ఉన్న స్కూల్ బిల్డింగ్ లలో తాత్కలిక కార్యాలయాలు తెరిచి పేరెంట్స్ వద్ద రూ. లక్షలు వసూలు చేస్తున్నాయి.కొన్ని స్కూళ్లు ఒకటి నుంచి ఏడో తరగతి వరకే అనుమతులు తీసుకుని 8,9,10 వ తరగతి గదులు నడిపిస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు సాధారణ స్కూల్ అని అనుమతులు తీసుకుని ఇంటర్నేషనల్, టెక్నో, కాన్సెప్ట్ అని రకరకాల ట్యాగ్ లు తగిలించి పేరేంట్స్ వద్ద దోపిడికి పాల్పడుతున్నాయి.

మచ్చుకు కొన్ని..

-.కుత్బుల్లాపూర్ మండలం, సుచిత్ర వద్ద గల వశిష్ట భవన్ లో అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య స్కూల్ నడుపుతుండగా, దిశ వరుస కథనాలతో విద్యా శాఖ ఆ స్కూల్ ను మూసివేసింది. అయితే అప్పటికే స్కూల్ యాజమాన్యం వందల సంఖ్యల్లో పేరెంట్స్ నుంచి స్కూల్ అడ్మిషన్లు, ఫీజుల పేరిట రూ. కోట్లలో వసూలు చేసింది.

-.క్రిష్ణానగర్ , ఎన్ఎస్పీ కాలనీలో శ్రీ చైతన్య స్కూల్ కొత్త బ్రాండ్ తెరిచింది. అయితే బిల్డింగ్ నిర్మాణంలో ఉండగానే వాచ్ మెన్ రూమ్ లో 2024-25 వ సంవత్సరానికి ఆడ్మిషన్లు తీసుకుంది. అయితే దిశలో వచ్చిన కథనంతో మున్సిపల్ అధికారులు వాచ్ మెన్ గదిని కూల్చేశారు. దీంతో చైతన్య స్కూల్ తాత్కలికంగా అడ్మిషన్ లను నిలిపివేసింది.

-తాజాగా ఉప్పల్ మండలంలోని హనుమసాయి నగర్ లోని అనుమతి లేకుండా నడుస్తున్న మాస్టర్ మైండ్స్ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఏవైఎఫ్ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తుండగా, ఎట్టకేలకు స్పందించిన విద్యాశాఖ మంగళవారం స్కూల్ ను సీజ్ చేసింది. అయితే ప్రజా సంఘాలు గానీ, స్టూడెంట్ యూనియన్లు గానీ, పత్రికలలో వస్తున్న కథనాల వల్లనే విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటున్నారు తప్ప.. స్వతహాగా తనిఖీలు నిర్వహించి గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కావాల్సిన అనుమతులు ఇవీ..

కొత్తగా ఒక పాఠశాలను ప్రారంభించాలంటే తనిఖీ ఫీజు, డిపాజిట్ తదితరాలకు బడి ప్రాంగణం విస్తీర్ణాన్ని బట్టి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు ఫీజు చెల్లించాలి. అగ్నిమాపక శాఖ ఎన్ఓసి, ట్రాఫిక్ పోలీసుల క్లియరెన్స్, శానిటరి సర్టిఫికెట్, పాఠశాల భవనం పటిష్టత ధ్రువ పత్రాలు పొందాలి. ఒకసారి అనుమతి పొందితే.. పదేళ్ల వరకు గడువు ఉంటుంది. గుర్తింపులేని బడులకు విద్యా హక్కు చట్టం ప్రకారం రూ. లక్ష జరిమానా విధించవచ్చు.. కానీ మేడ్చల్ జిల్లాలో జరినామా విధించిన దాఖలాల్లేవు.. ఇప్పటికైనా మేడ్చల్ జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాయి. అనుమతులు లేని పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారిని వివరణ కోరేందుకు ‘దిశ’ తన కార్యాలయంలో ప్రయత్నించగా, ఆమె అందుబాటులో లేరు. ఫోన్ చేస్తే కలవడం లేదు..

Advertisement

Next Story