కబ్జా కోరల్లో జడ్పీ‌హెచ్ఎస్ (బాలికల) పాఠశాల స్థలం

by Naresh N |
కబ్జా కోరల్లో జడ్పీ‌హెచ్ఎస్ (బాలికల) పాఠశాల స్థలం
X

దిశ, దుబ్బాక: ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు ఖాళీగా కనిపిస్తే చాలు కొందరు అక్రమార్కులు వదలడం లేదు. కన్ను పడితే చాలు కబ్జా చేసేస్తున్నారు. మున్సిపల్ పట్టణం పరిధిలోని భూములకు రెక్కలు రావడంతో భూ కబ్జాదారులు రాబందులుగా వాలిపోతున్నారు. ఆ భూమి ఎవరిదైతే నేమ్ అధికారులతో కుమ్మక్కై ఆ భూములను వారి సొంతం చేసుకోవడమే వారి టార్గెట్. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఇక కబ్జాదారులకు పండగే.. పండగే. స్థలాలను ఇష్టానుసారంగా ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు కడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 473 సర్వే నంబర్‌లో 2ఎకరాల 16గుంటల విస్తీర్ణంలో స్థలం విస్తరించి ఉంది. ఆ భూమి పన్యాల మహేందర్ రెడ్డి అనే వ్యక్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొరకు తన స్థలాన్ని పాఠశాల నిర్మించుట కొరకు గతంలో దానంగా ఇచ్చారు.

అందులో నుంచి 500. 92 చదరపు గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు కలిసి కాలి స్థలానికి ఎలాంటి నిర్మాణం లేని స్థలంకు 1-83/3/సి ఇంటి నెంబర్ కేటాయించి మల్లు గారి రాజిరెడ్డి అనే వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని కోట్లకు పడగలెత్తుతున్నారు. సర్వే నంబర్‌ 473లో దాదాపుగా 2 ఎకరల16 గుంటల విస్తీర్ణంలో స్థలం ఉంది. దాదాపు అక్కడ ఆ స్థలం సుమారుగా రూ.10వేల నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. కోట్లకు విలువచేసే ఈ భూమిపై కన్నేసిన కొందరు ఆక్రమణదారులు ఆ భూమిని అమ్మి సొమ్ము చేసుకున్నారని పలువురు బహిరంగ ఆరోపిస్తున్నారు. పేదవాడు సెంటు స్థలాన్ని ఆక్రమిస్తే ఆఘమేఘాల పై వెళ్ళి అడ్డుకునే రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్న కనీసం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. భారీ స్థాయిలో రెవెన్యూ అధికారులకు నజరాన ముట్టజెప్పడంతో ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక రాజకీయ నేతల అండతో కొంత మంది ఆక్రమించుకుని ఆ స్థలాన్ని యంత్రాలతో చదును చేసి మరొకరికి కొనుగోలు చేసి కోట్లాది రూపాయల సొమ్ము చేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని జెడ్పీ,హెచ్, ఎస్ పాఠశాల (బాలికల)కు వినియోగించాలని పలువురు కోరుతున్నారు. స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని స్థలాన్ని సర్వే చేసి మళ్లీ ఎలాంటి కబ్జాకు గురి కాకుండా చూడాలని కోరుతున్నారు.



స్థలం మార్పిడి పేరిట కబ్జా

గతంలో జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాల.(బాలికల) దుబ్బాక పాఠశాలకు ప్రహరి గోడ నిర్మిస్తున్న సమయంలో పాఠశాల స్థలం దీర్ఘ చతురస్రంగా లేని కారణంగా దీర్ఘచతురస్రంగా చేసుకొనుటకు అవసరమైన స్థలం మల్లు గారి రాజిరెడ్డి, నర్సారెడ్డి, సంజీవరెడ్డి తండ్రి బొందారెడ్డిల స్థలం అవసరమైనందున వారిని పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ సభ్యులు ఒప్పించి 1220 చ.గ. స్థలం తీసుకుని 1220 చ.గ. పాఠశాల ఉత్తర భాగం స్థలాన్ని వారికి మల్లు గారి రాజిరెడ్డి, నర్సారెడ్డి, సంజీవరెడ్డిలకు ఇచ్చుటకు ఒప్పించి స్థల మార్పిడి చేశారని 21/04/2015 లో జిల్లా విద్యాధికారికి, జిల్లా కలెక్టర్‌కు లేఖను పంపారు. పై అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాకుండా, జిల్లా అధికారుల పర్మిషన్స్ లేకుండా వీరి ఇష్టానుసారంగా స్వార్థ లాభాల కొరకు పాఠశాల స్థలంలో నుంచి ఇరువైపులా రోడ్డు తీసి స్థల మార్పిడి చేసి స్థలాన్ని కబ్జా చేశారు అంటూ ఆరోపణలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్, అధికారులు వెంటనే స్పందించి దుబ్బాక పట్టణంలోని 16 వ వార్డులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల) పాఠశాలకు సంబంధించిన స్థలమును సర్వేలు చేసి ఇతరులు కబ్జాలు చేయకుండా పాఠశాలకు అప్పగించాలని దుబ్బాక పట్టణ ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed