జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ నామినేషన్

by Disha Web Desk 11 |
జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ నామినేషన్
X

దిశ, సంగారెడ్డి : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతికి మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ… ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అమలు కానీ హామిలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. దీంతో కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామిలలో 13 అంశాలు ఉన్నాయని అందులో నుంచి ఉచిత బస్సు సౌకర్యం మాత్రమే చేసిందన్నారు. ఇంకా రైతులకు ఇచ్చిన రైతు భరోసా, పంటలకు రూ.500 భోనస్, కౌలు కూలీలకు ఇస్తామన్నా రూ.12 వేలు, పింఛన్ రూ.4వేలు నేటికి నెరవేర్చలేదని ఆరోపించారు. రైతులకు, యువకులకు అన్ని విధాలుగా మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారన్నారు. అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు.

ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైనవని, జాతీయ పార్టీలు ఒక పక్క, ప్రాంతీయ పార్టీలు ఒక పక్క పోటీ పడుతున్నాయని తెలిపారు. స్థానికులకే ప్రజలు అవసరాలు తెలుస్తాయన్నారు. దేశం బాగుపడాలంటే ప్రాంతీయ పార్టీలను గెలిపించుకోవాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్రమోడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పి ఓట్లడగాలని డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్ లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి తన ఓటమిని తానే కొనితెచ్చుకున్నాడన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భగవంతుడు విజయం చేకూర్చాలని కోరుతున్నానన్నారు. ప్రజలు అనిల్ కుమార్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed