మోదీ ప్రధాని అయ్యేంత వరకు మత్య్సకారులను ఎవరూ పట్టించుకోలేదు : కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

by Disha Web Desk 1 |
మోదీ ప్రధాని అయ్యేంత వరకు మత్య్సకారులను ఎవరూ పట్టించుకోలేదు : కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మత్య్సకారుల అభ్యున్నతికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పాడి, మత్య్స పరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట లో కేంద్ర మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రైస్ మిల్ అసోషియేషన్ లో మత్య్సకారుల అవగాహన సదస్సు నిర్వహించగా.. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కేంద్ర పాడి, మత్య్స పరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ... దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేంత వరకు మత్య్సకారుల అభ్యన్నతి కోసం ఏ ప్రధాని అలోచించలేదన్నారు.

ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే మత్య్సశాఖకు స్వతంత్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. దీనికి తోడు మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.20వేల కోట్లతో పథకం ప్రవేశ పెట్టి అమలు చేశారని తెలిపారు. మత్య్సశాఖలో సౌకర్యాల కల్పన కోసం అదనంగా రూ.8 వేల కోట్లను కేటాయించారని తెలిపారు. హరిత విల్లవం, శ్వేత విప్లవం మాదిరి ప్రధాని మోదీ నీలి విప్లవానికి శ్రీకారం చుట్టి రూ.4వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. తాజాగా కేంద్ర బడ్జెట్ లో మత్య్సశాఖకు రూ.6 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.

రైతుల మాదిరి మత్య్సకారులను అందుకోవాలన్నదే ప్రధాని మోదీ అకాంక్ష అని అన్నారు. అందులో భాగంగానే కిసాన్ క్రిడిట్ కార్డుల మాదిరి మత్య్సకారులకు క్రెడిట్ కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. క్రెడిట్ కార్డుల ద్వారా ఏలాంటి సెక్యురిటీ లేకుండా రూ. 1.60 లక్షల వరకు 4 శాతం వడ్డీతో అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. మత్య్సకారులు సగర్వంగా తలెత్తుకొని జీవించే విధంగా కేంద్రం వెన్నంటి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరుపున నాణ్యమైన చేపపిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు.

ఇందుకు తోడు మత్య్సకారులు, మత్య్సకార మహిళల కోసం సగర్వంగా జీవించడానికి, మత్స్య వ్యాపారం అభ్యున్నతి కోసం ఏ కార్యక్రమం అమలు చేయాలో ప్రాజెక్టు రుపొందించి అందజేస్తే కేంద్ర ప్రభుత్వం తరుపున అమలు చేస్తానని పురుషోత్తం రూపాల హామీ ఇచ్చారు. అనంతరం బోయిగల్లిలోని గుండబోయిన కృష్ణ నివాసంలో కేంద్ర పాడి, మత్య్స పరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల సహపంక్తి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, నాయకులు కొత్తపల్లి వేణుగోపాల్, ఉపేందర్ రావు, వంగ రామచంద్రారెడ్డి, సొప్పదండి విద్యాసాగర్, గుండ్ల జనార్ధన్, తోడుపూరి వెంకటేశం, మత్స్యకార సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేషం, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మత్య్సకారులు, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్ లో కేంద్ర పాడి, మత్య్స పరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.



Next Story