నయవంచనకు మారుపేరు కాంగ్రెస్

by Disha Web Desk 15 |
నయవంచనకు మారుపేరు కాంగ్రెస్
X

దిశ, చిన్నశంకరంపేట : పదేళ్ల మోడీ పాలన, దేశ అభివృద్ధిని చూసి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి గెలిపించి మూడోసారి ప్రధాన మంత్రిగా మోడీని చూడాలని కోరుకుంటున్నారని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గురువారం రాత్రి చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఆలయం నుండి చేగుంట రహదారి వరకు రోడ్ షో నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు పోగుల రాజు ఆధ్వర్యంలో ఈ రోడ్​ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు అయిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి హామీలు అమలు చేయడానికి బడ్జెట్ లేకున్నా ,మాయమాటలతో ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ కాలాన్ని నెట్టుకొస్తుందని విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీ స్థానాలు పొందినా దేశ రాజకీయంపై ప్రభావం ఏమాత్రం ఉండదని తెలిపారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నందున ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కేంద్రం సహాయంతో రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి మెదక్ పార్లమెంట్ సీటును ప్రధాని మోడీకి కానుకగా ఇద్దామని ఆయన పేర్కొన్నారు. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు గడవకముందే ఢిల్లీ నేతలకు ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పంజా విజయ్ కుమార్, మండల పార్టీ నాయకుడు పోగుల రాజు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story

Most Viewed