సుడా ఆధ్వర్యంలో వెంచర్..​ రాష్ట్రంలోనే సిద్దిపేటలో తొలిసారి

by Disha Web Desk 6 |
సుడా ఆధ్వర్యంలో వెంచర్..​ రాష్ట్రంలోనే సిద్దిపేటలో తొలిసారి
X

ప్రైవేట్‌ లే–అవుట్లలో రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండానే, సరైన రీతిలో అభివృద్ధి చేయకుండానే.. ప్లాట్లుగా విభజించి అమ్ముకుంటున్నారు. ఇలాంటి ప్లాట్లను కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ తో పాటు ఇంటి నిర్మాణ అనుమతులు పొందడానికి ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షలు కట్టి ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఈ ప్లాట్లను తప్పనిసరిగా క్రమబద్ధీకరించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తామే అసైన్డ్​ భూములను క్రమపద్ధతిలో నగరాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయని భావించిన ప్రభుత్వం హెచ్ ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా లే అవుట్ ను సిద్ధం చేయాలని నిర్ణయించింది.

ఇందుకోసం రాష్ట్రంలోనే తొలిసారి సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోనే మోడల్ లేఅవుట్ రెడీ చేసింది. 11 మంది రైతుల నుంచి 14 ఎకరాల అసైన్డ్‌ భూమిని సేకరించారు. ఈమేరకు ఆ స్థలంలో 102 ప్లాట్లను సిద్దిపేట అర్బన్​ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) సిద్ధం చేసింది. ఇందుకోసం బ్రోచర్లు ప్రింట్ చేయించి ముమ్మర ప్రచారం చేస్తోంది. గజానికి రూ.8 వేలు కనిష్ఠ ధరగా నిర్ణయించింది.

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సుడా ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న మిట్టపల్లి వెంచర్​లో హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా అన్ని వసతులు కల్పిస్తున్నారు. 60 ఫీట్లు, 30 ఫీట్ల రోడ్లు, స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నీటి వసతి కల్పించారు. పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి కాగా.. త్వరలో ఓపెన్ యాక్షన్ ద్వారా ప్లాట్లను అమ్మడానికి సుడా ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు.

14 ఎకరాల్లో 68 వేల గజాల స్థలం అందుబాటులోకి రాగా.. అందులో రోడ్లు, డ్రైనేజీలు, పార్క్ లకు 30 వేల గజాలు కేటాయించారు. మిగిలిన 38 వేల గజాల్లో 161 ప్లాట్లు వేశారు. వీటిలో అసైనీలకు 50 ప్లాట్లు పోగా, 102 ప్లాట్లను అమ్మనున్నారు. ఒక్కో ప్లాట్ కనిష్టంగా 150 గజాల నుంచి గరిష్టంగా 250 గజాల విస్తీర్ణంలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గజానికి రూ.8 వేల కనిష్ట ధరగా నిర్ణయించారు. ఈనెల 20న విపంచి కళానిలయంలో వేల పాటకు సంబంధించి ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు.

అసైనీలకు ఎకరాకు 8 వందల గజాలు

మిట్టపల్లి లో సుడా ఆధ్వర్యంలో లే అవుట్ కోసం 11 మంది నుంచి 14 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం సేకరించింది. అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి, కొనడానికి అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం సేకరణ సమయంలో మొదట రైతుల నుండి కాస్త వ్యతిరేఖత వ్యక్తమైనప్పటికి, భూములు అప్పగిస్తే డెవలప్ చేసి అందులోనే ఎకరాకు 800 గజాల ప్లాట్లు ఇస్తామని ఆస్థలం అమ్ముకొనే వీలు ఉంటుందని చెప్పడంతో రైతులు ముందుకొచ్చారు.

దీనికి తోడు పొన్నాల గ్రామం వద్ద 44 ఎకరాల అసైన్డ్ భూములల్లో వెంచర్ ఏర్పాటుకు సిద్దిపేట అర్బన్​ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు నిర్ణయం తీసుకొని పనులు మొదలు పెట్టారు. ఎలాంటి వివాదం లేకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేయనుండడంతో కొనుగోలు దారులకు టైటిల్‌ గ్యారెంటీ సైతం లభించనుంది. దీంతో సుడా లే అవుట్ లో ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో సర్కార్ ఊహించిన దానికంటే ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉంది.

Next Story

Most Viewed