నిర్దిష్ట ప్రణాళికతో సజావుగా ధాన్యం సేకరణ జరగాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

by Disha Web Desk 20 |
నిర్దిష్ట ప్రణాళికతో సజావుగా ధాన్యం సేకరణ జరగాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
X

దిశ, సంగారెడ్డి : జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యాసంగి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా ఆయా శాఖల అధికారులు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్ళపై కలెక్టరే ట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపీ సీసీలు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు. తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిష్టితుల్లోనూ రైతులు నష్టపోకుండా పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగాలని సూచించారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 209 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని, జిల్లాలో 2,07,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అంచనా ఉందన్నారు. అవసరం ఉన్న చోట, ధాన్యం పండించే ప్రతి గ్రామంలో డిమాండ్ ఉన్న మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ఏఈఓ ను ఇంచార్జిగా నియమించామని, అదేవిధంగా ఒక విఆర్ఏ ఉంటారని, వీరిపై సూపర్వైజర్ అధికారులు ఉంటారని తెలిపారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను సమకూర్చుకోవాలని, అవసరమైన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే టాబ్ ఎంట్రీ చేయాలని, 72 గంటలలోపు ధాన్యం డబ్బులు రైతు ఖాతాలో జమ అవుతుంది అన్నారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైనన్ని గన్నీ బ్యాగులు, ప్యాడి క్లీనర్స్ ,వేయింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం పంటల మద్దతు ధరకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, డీ ఎస్ ఓ వనజాత, డీసీఓ ప్రసాద్, డీఆర్ డీఓ శ్రీనివాసరావు, మార్కెటింగ్ అధికారి, సివిల్ సప్లై స్ డీఎం సుగుణ భాయ్, వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, ఏఓలు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, రైస్ మిల్లర్లు, ప్యాక్ కేంద్రాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed