దేశంలో ఎన్నికలు నడుపుతున్నది ఈసీ కాదు.. ఈడీ: బీజేపీపై మన్నె క్రిశాంక్ ఫైర్

by Disha Web Desk 19 |
దేశంలో ఎన్నికలు నడుపుతున్నది ఈసీ కాదు.. ఈడీ: బీజేపీపై మన్నె క్రిశాంక్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సీఎం కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదు అన్న అంశం లోక్ సభ ఎన్నికల ఎజెండాగా ఉండరాదన్నది బీజేపీ ఆలోచన విధానమన్నారు. దేశంలో బీజేపీ కాకుండా ఏ పార్టీ ఉండకుండ ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేరళ సీఎం విజయన్ కుమార్తెపై ఈడీ కేసు పెట్టారు.. ఆర్జేడీ, శివసేన, డీఎంకే, టీఎంసీ, సమాజ్ వాదీ నేతలకు నోటీసులు ఇస్తున్నారు.. వాళ్లంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా.. మోదీ విచారణలో పాల్గొనాలా అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చ లేకుండా చేస్తున్నారని అన్నారు.

దేశంలో ఎన్నికలు నడుపుతున్నది ఈసీ కాదు.. ఈడీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు అందరూ ప్రచారం చేయకుండా ఈడీ కార్యాలయాల చుట్టూ తిరగాలా అని ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరి లొంగితే ఎలాంటి అరెస్టులు ఉండవన్నారు. లొంగకుండా పోరాటం చేస్తున్నవారిపై వేధింపులు, దాడులు, కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలు ఎజెండాగా కాకుండా దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలను జైళ్లో పెట్టి ఏకపక్షంగా ఎన్నికల్లో గెలవాలని మోడీ భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. 400 సీట్లు వచ్చే ధైర్యం ఉంటే మోదీ ఇలా ఎందుకు చేస్తున్నారు..? బీఆర్ఎస్ లేదు అంటున్న కిషన్ రెడ్డి.. మా పార్టీ నేతలను తీసుకొని ఎందుకు ఎంపీ టికెట్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే మోదీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తామన్నారు.


Next Story