చెల్లెలు తీహార్ జైల్లో…. అన్న గోవా బీచ్‌లో

by Disha Web Desk 22 |
చెల్లెలు తీహార్ జైల్లో…. అన్న గోవా బీచ్‌లో
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: లిక్కర్ స్కాంలో తన చెల్లెలు కవిత దోషిగా తీహార్ జైల్లో ఉంటే సోయి లేకుండా అన్న కేటీఆర్ గోవాలో విందులు, వినోదాలతో తేలియాడుతున్నాడని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కారానికే ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, ఎన్నికల కోడ్ వల్లనే పథకాలు ఆగిపోయాయని ఆయన తెలిపారు.100 రోజుల కాంగ్రెస్ పార్టీ పాలననే మా రెఫరెండంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ముందుకు పోతామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి ఒక్క పక్క, మరో పక్క కూతురు కవిత జైలు పాలు, నమ్మిన వాళ్ళు పార్టీ వీడి పోవడంతో కేసీఆర్ మానసిక స్థితి బాగా లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో నిలిచిన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేసి భయపెట్టి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రప్రభుత్వం మౌనం ఎందుకు వహిస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని, ఇద్దరు కుమ్మకై కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.

అన్ని రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తే మన రాష్ట్రంలో మాత్రం ఫోన్ ట్యాపింగ్ యూనివర్సిటీ వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఎవరికి అనుమానం వచ్చినా వెంటనే సిట్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన బాధితులకు సూచించారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగాయో ప్రజలు గమనించాలని, పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే కల్వకుంట్ల కుటుంబం అంతా తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.


Next Story

Most Viewed