ఆసుపత్రిలో రక్త నిల్వలను పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్

by Aamani |
ఆసుపత్రిలో రక్త నిల్వలను పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్
X

దిశ,నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి జిల్లా ఆస్పత్రిలో రక్త నిల్వలను పెంచుకోవాలని, ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకును మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ప్రపంచ రక్త దాత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని యువకులు అధిక సంఖ్యలో రక్తదాన శిబిరానికి వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... యువకులు స్వచ్ఛందంగా రక్త దానం చేయాలని, జిల్లాలో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని, రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని తెలిపారు.రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలను పెంచుకోవాలని, బ్లడ్‌ బ్యాంకులను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి వ్యక్తి కూడా రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. 40 సార్లు రక్తదానం చేసిన శ్రీను ను ఈ సందర్భంగా కలెక్టర్ సన్మానించారు. రక్తదానం చేసిన వారందరినీ ప్రశంసిస్తూ సర్టిఫికెట్లను అందజేశారు. 50 యూనిట్ల రక్తాన్ని ఈ కార్యక్రమం ద్వారా సేకరించినట్లు తెలిపారు.జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆస్పత్రి సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎంహెచ్వో సుధాకర్ లాల్, జిల్లా సూపర్డెంట్ రఘు, కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిబాబు, సెక్రటరీ సురేష్ బాబు, ట్రెజరర్ నాగరాజు,రెడ్ క్రాస్ జిల్లా సెక్రటరీ రమేష్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిత్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story