కేఎస్‌ఆర్‌కు షాక్..​కదిలొచ్చిన అధికారులు

by Disha Web Desk 4 |
కేఎస్‌ఆర్‌కు షాక్..​కదిలొచ్చిన అధికారులు
X

లకుడారం పెద్ద చెరువును ఆనుకొని మైనింగ్​నిర్వహిస్తున్న కేఎస్‌ఆర్ కంపెనీకి షాక్ తగిలింది. 48 రోజులుగా గ్రామస్తులు చేస్తున్న నిరసనలు, సామాజిక కార్యకర్తల మద్దతు, ‘దిశ’ వరుస కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. సీఎస్​శాంతకుమారి ఆదేశాలతో కేఎస్‌ఆర్ మైనింగ్​అనుమతులపై రాష్ట్ర మైనింగ్​శాఖ మంగళవారం విచారణ చేపట్టింది. లకుడారం పెద్ద చెరువు వద్ద సర్వే నంబర్​747లోని 4 ఎకరాల్లో కేఎస్‌ఆర్ కంపెనీ అనుమతులు తెచ్చుకొని మైనింగ్​నిర్వహిస్తోంది.

దీన్ని లకుడారం గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చెరువు కిందే తవ్వకాలు జరపడం మూలంగా చెరువు కట్ట తేగి ముంపు వాటిల్లే ప్రమాదం ఉందని, పంట పొలాల మధ్యలో మైనింగ్​ పనులు జరుగుతుండడంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వీరి సమస్యలను ‘దిశ’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా సామాజిక కార్యకర్తలు కూడా గ్రామస్తులకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో సీఎస్​ విచారణకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు మైనింగ్​శాఖ విచారణ చేపట్టింది.

- దిశ, పటాన్​ చెరు

పెద్ద చెరువును పరిరక్షించాలని గ్రామస్థుల ఆందోళన.. చెరువు కింద క్రషర్ వద్దంటూ 48 రోజుల నుండి రిలే నిరసన దీక్షలు.. గ్రామస్థులకు జత కలిసిన సామాజిక వేత్తలు, న్యాయనిపుణులు. చెరువు కింద క్రషర్ ఏర్పాటుతో జరిగే ప్రమాదం, గ్రామస్థుల ఆందోళన ల పై "దిశ" లో వరుస కథనాలు.. గ్రామస్థులకు మద్దత్తుగా రంగంలోకి దిగిన సామాజిక కార్యకర్తలు, న్యాయ నిపుణులు ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి.. ఎట్టకేలకు అధికారులలో చలనం వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పటాన్ చెరు మండలం లకుడారం గ్రామంలో కంకర క్వారీ అనుమతుల వ్యవహారంపై తీవ్ర వివాదాస్పదమైంది.

లకుడారం పెద్ద చెరువును అనుకుని సర్వేనెంబర్ 747లో 4 హెక్టార్ల విస్తీర్ణంలో కేఎస్ఆర్ మైనింగ్ కు అనుమతులు ఇచ్చారు. సదరు సంస్థకు అనుమతులు ఇచ్చిన ప్రదేశం పెద్ద చెరువుకు ఆనుకుని ఉండడంతో ఈ క్వారీ అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు 48 రోజులుగా వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న పెద్ద చెరువు కింద 600 మంది రైతులు వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారని చెరువుకి ఏదైనా ప్రమాదం సంభవిస్తే అందరి బతుకులు రోడ్డున పడతాయని ఆందోళన బాట పట్టారు. చెరువు కింద క్రషర్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ కలెక్టర్‌ను సైతం కలిశారు.

కలెక్టర్ సంయుక్త సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చే వరకు పనులు నిలిపివేయాలని తెలిపారు. అయితే మళ్లీ కొద్ది రోజుల్లోనే సమస్య మొదటి కొచ్చింది. మళ్లీ క్వారీ పనులు మొదలుపెట్టారు. దీంతో మరోసారి గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. గ్రామస్తులకు అండగా దిశ పత్రిక వరుస కథనాలను ప్రచురించింది. పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయనిపుణులు గ్రామస్తులకు మద్దతు‌గా రాష్ట్ర స్థాయి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

సామాజిక కార్యకర్త, న్యాయవాది రవి కృష్ణ క్రషర్‌తో పెద్ద చెరువుకు భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదం, కాలుష్యం ద్వారా గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ లేఖ రాశారు. దీంతో కదిలిన సర్కార్ చెరువు కింద ఏర్పాటైన కేఎస్ఆర్ క్రషర్ మీద పూర్తి విచారణ జరపాలని తెలంగాణ సీఎస్ శాంతకుమారి కుమారి మైనింగ్ శాఖను ఆదేశించారు. దీంతో మైనింగ్ డైరెక్టర్ రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు అడిషనల్ మైనింగ్ అధికారి రామకృష్ణ మంగళవారం విచారణకు వచ్చారు.

చెరువుకు ప్రమాదం జరిగితే చెరువు కింద భూములతో పాటు లకుడారం గ్రామం నీట మునుగుతుందని గ్రామస్తులు మైనింగ్ అధికారులకు వివరించారు. అధికారులు కనీసం ఎటువంటి క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకుండా చెరువు కింద 100 మీటర్ల దూరంలో క్వారీకి అనుమతులు ఇవ్వడంపై మండి పడ్డారు. గ్రామస్తుల అభ్యర్థనను పూర్తిగా విన్న మైనింగ్ అధికారులు గ్రామస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

చెరువులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదే: సుబ్బారావు

టెక్నికల్ మెంబర్, చెరువులు-రిజర్వాయర్లు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రకృతి సహజ వనరులైన చెరువులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువు వందల ఏళ్లుగా 1100 ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీటి కోసం రూ.లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం చెరువులు అన్యాక్రాంతమవుతున్న పట్టించుకోకపోవడం దారుణం. ఈ క్వారీలో జరిగే పేలుళ్లతో చెరువు పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం పొంచి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం క్వారీ అనుమతులు రద్దుచేసి పెద్ద చెరువును పరిరక్షించాలి.

మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి – రవి కృష్ణ న్యాయవాది

మైనింగ్ పేరుతో అనుమతులు తీసుకుని అన్ని క్రషర్ల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. దానికి తోడు రెవెన్యూ శాఖ అలసత్వం రైతులను ఆగం చేస్తుంది. చెరువు కింద క్రషర్ ఏర్పడితే పూర్తిగా చెరువు ప్రమాదంలో పడుతుంది. 1100 ఎకరాల వ్యవసాయం బీడు పడుతుంది. దానికి తోడు ముందు నడుస్తున్న క్రషర్లా అక్రమాలతో ప్రభుత్వానికి రాయల్టీ సరిగ్గా చెల్లించడం లేదు. లక్డారం గ్రామం నుండి వందల కోట్లు సేకరిస్తున్న ప్రభుత్వం గ్రామాన్ని ఎడారిగా మార్చడం సరికాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి అక్రమ మైనింగ్‌ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు చెరువు కింద ఉన్న క్రషర్ అనుమతులు రద్దు చెయ్యాలి. గ్రామస్థులకు న్యాయం జరిగేందుకు అవసరమైతే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తాం..


Next Story

Most Viewed