మంత్రి గంగుల కమలాకర్ కు హైకోర్టు షాక్.. ఆ కేసులో కీలక ఉత్తర్వులు

by Dishafeatures2 |
మంత్రి గంగుల కమలాకర్ కు హైకోర్టు షాక్.. ఆ కేసులో కీలక ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ కు హైకోర్టు షాకిచ్చింది. ఆయన ఎన్నికను సవాల్​ చేస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ దాఖలు చేసిన పిటీషన్​ పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు దీనిపై రిటైర్డ్​ జిల్లా న్యాయమూర్తితో కమిషన్​ ను ఏర్పాటు చేసింది. ఈనెల 12నుంచి 17వ తేదీ మధ్యలో క్రాస్​ ఎగ్జామినేషన్​ పూర్తి చేసి నివేదికను అందచేయాలని కమిషన్​ ను ఆదేశించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్​ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గంగుల కమలాకర్​ తన సమీప ప్రత్యర్థి బండి సంజయ్​ పై 14,974 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

అయితే, దీనిపై ఆ మరుసటి సంవత్సరం బండి సంజయ్ హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ ​అధికారి గంగుల కమలాకర్​ గెలిచినట్టుగా చేసిన ప్రకటన చెల్లదని పిటీషన్ లో పేర్కొన్నారు. గంగుల కమలాకర్​ తన ఎన్నికల అఫిడవిట్​ లో తప్పుడు వివరాలు అందచేశారని తెలిపారు. తనను విజేతగా ప్రకటించాలంటూ కోరారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. అనంతరం రిటైర్డ్ జిల్లా జడ్జి శైలజ నేతృత్వంలో కమిషన్​ ను ఏర్పాటు చేసింది. ఈనెల 12నుంచి 17వ తేదీలోపు క్రాస్​ ఎగ్జామినేషన్​ ను పూర్తి చేసి సమగ్ర నివేదికను అందచేయాలని కమిషన్​ కు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.

Next Story

Most Viewed