చరిత్రను భావితరాలకు చెప్పేందుకే ‘ఎపిగ్రఫీ’ మ్యూజియం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 19 |
చరిత్రను భావితరాలకు చెప్పేందుకే ‘ఎపిగ్రఫీ’ మ్యూజియం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో మన దేశంపై దాడి చేసిన మొఘలులు, మహమ్మదీయులది అనాగరిక చర్య అని, మనకు తెలియకుండానే పెద్దఎత్తున శిలాశాసనాలను ధ్వంసం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మిగిలిపోయిన శిలాశాసనాలైనా రక్షించుకోవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో సోమవారం దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. శిలాశాసనాలు చరిత్ర, అస్ధిత్వాన్ని, ప్రాచీన సంప్రదాయాలను తెలియజేస్తాయన్నారు. కొంతమంది ఆ కాలంలో తమకు అందుబాటులో ఉన్న రాళ్లపై, ఆలయాల స్తంభాలపై, ప్రముఖ కట్టడాలపై, ఇనుప రేకులపై, బంగారు నగలపై, కర్రలపై శాసనాలు రాసిన విషయాలను ఆయన గుర్తుచేశారు. ఇవి రాజుల చరిత్రలో, రాజకీయ చరిత్రలో కావన్నారు. ఏ దేశానికైనా శాసనాలు వెన్నముకలాంటివని కిషన్ రెడ్డి కొనియాడారు.

చరిత్రను పునర్నిర్మించుకోవడానికి శాసనాలను మించిన ఆధారాలు ఎక్కడా ఉండవన్నారు. మన పూర్వికుల చరిత్రను భావితరాలకు అందించాలంటే దానికి ఏకైక ఆధారం ఈ శాసనాలేనని ఆయన వెల్లడించారు. ఇప్పుడన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో సాఫ్ట్ వేర్, డిజిటలైజేషన్ టెక్నాలజీతో ఆ శాసనాలను డీకోడ్ చేసి నేటితరానికి అందించే ప్రయత్నం చేయాలని కోరారు. చరిత్రను భావితరాలకు అందించేందుకే ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనేక ఉత్తరాలు రాశానని తెలిపారు. అనేక ఇతర కార్యక్రమాలకు, పార్టీ ఆఫీసులకు భూములిస్తారు కానీ ఇలాంటి ఇనిస్టిస్ట్యూట్‌కు భూమి ఇవ్వాలంటే మాత్రం జవాబు ఇవ్వడం లేదని ఆయన విమర్శలు చేశారు. ఎపిగ్రఫీ మ్యూజియం కోసం భూమి ఇస్తే పెద్ద క్యాంపస్‌లో ఏర్పాటు చేసేవారిమని తెలిపారు. ఈ మ్యూజియం ద్వారా దేశంలో ఉన్న లక్షలాది ప్రాచీన శిలాశాసనాలన్నింటినీ పొందుపరిచే ప్రయత్నం చేస్తామన్నారు.

Next Story

Most Viewed