TSPSC పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు.. రేణుకపై ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు!

by Disha Web Desk 19 |
TSPSC పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు.. రేణుకపై ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా ఈ కేసులో మూడో నిందితురాలిగా ఉన్న గురుకుల టీచర్ రేణుకను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక, బెయిల్ మీద విడుదలైన లద్యావత్ డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్, బోర్డు ఉద్యోగిని షమీమ్, గోపాల్ నాయక్‌లకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన రేణుకను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దీంట్లో బోర్డు ఉద్యోగి ప్రవీణ్ కుమార్ నుంచి తాను 10 లక్షల రూపాయలకు ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రాలను కొన్నట్టు రేణుక చెప్పినట్టు సమాచారం.

కర్మన్ ఘాట్ రోడ్డులోని ఓ హోటల్‌లో నగదు ఇచ్చి వీటిని కొన్నానని వెల్లడించినట్టు తెలిసింది. ఇలా కొన్న ప్రశ్నా పత్రాలను తన భర్త డాక్యా నాయక్‌కు ఇచ్చానని చెప్పినట్టు తెలియ వచ్చింది. డాక్యా నాయక్ వాటిని ఎవరెవరికి అమ్మాడు, నగదు లావాదేవీలు ఎలా జరిగాయన్న వివరాలు తనకు తెలియదని రేణుక చెప్పినట్టు సమాచారం. తన స్నేహితుడు అయిన రాహుల్‌కు ప్రశ్నా పత్రాలు ఇచ్చానని, అతను పరీక్ష కూడా రాశాడని వెల్లడించినట్టు తెలిసింది. డాక్యా నాయక్ జరిపిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు తెలియవని రేణుక చెప్పిన నేపథ్యంలో ఈడీ అధికారులు అతన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే అతనికి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఇక, డాక్యా నాయక్ బావమరిది రాజేశ్వర్ నాయక్ కూడా కొంతమందికి ప్రశ్నా పత్రాలు అమ్మిన నేపథ్యంలో అతనికి కూడా నోటీసులు జారీ చేశారు. రాజేశ్వర్ నాయక్ నుంచి ప్రశ్నా పత్రాలు కొన్న గోపాల్ నాయక్‌ను కూడా తమ ఎదుట హాజరు కావాలని తాఖీదులు పంపారు. ఇక, బోర్డులో పనిచేస్తూ లీకైన గ్రూప్ 1 ప్రశ్నా పత్రాలతో పరీక్ష రాసిన షమీమ్‌కు కూడా నోటీసులు ఇచ్చారు.

Next Story