MLA కాకున్నా మంత్రిని చేసినం.. ఇక డ్రామాలు బంద్ చేయ్: హరీష్ రావుపై బండి ఫైర్

by Disha Web Desk 19 |
MLA కాకున్నా మంత్రిని చేసినం.. ఇక డ్రామాలు బంద్ చేయ్: హరీష్ రావుపై బండి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే కాకున్నా హరీష్​రావును మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పుడు తమ పార్టీనే విమర్శించడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ స్పోక్స్ పర్సన్ బండి సుధాకర్ గౌడ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. చరిత్రను హరీష్ రావు మర్చిపోయినా, ప్రజలు మరువలేదన్నారు. ఇప్పటికైనా డ్రామాలు బంద్ చేస్తే బెటర్ అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కథలు అల్లి ప్రజలను మోసం చేసిన వ్యక్తి హరీష్​రావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యమ సమయంలో తెలంగాణ యువతను రెచ్చగొట్టేందుకు మీద పెట్రోల్ పోసుకొని, అగ్గిపెట్టె మరిచిపోయిన చరిత్ర హరీశ్ రావుది అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టడంతోనే 1200 మంది అమరులయ్యారని, అందులో కేవలం 400 మందిని మాత్రమే ఆదుకొని, మిగతా 800 మందిని విస్మరించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని బండి సుధాకర్ విమర్శించారు. అమరుల త్యాగాల పునాదుల మీద రాజ్యమేలి రాక్షసానందం పొందిన మీకు అమరవీరుల స్థూపం వద్ద రాజీనామా డ్రామాలాడే నైతిక హక్కు లేదని బండి హెచ్చరించారు.

ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ రూ.17 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పాటు చేస్తే, బంధుప్రీతితో కొత్త రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్పగా చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా..? అని బండి సుధాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ విషయంలో బద్నాం చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా చెప్పారు. బీఆర్ఎస్ గెలవకపోతే మీ పార్టీని రద్దు చేసుకుంటారా..? అని ప్రశ్నించారు. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి పంద్రాగస్టు నాటికి రుణమాఫీ అమలు చేసి తీరుతారని బండి సుధాకర్ అన్నారు. హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు చౌకబారు ప్రయత్నాలు మాని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బండి సుధాకర్ గౌడ్ హితవు పలికారు.



Next Story

Most Viewed