ఇంటర్నల్ ఆపరేషన్‌ లీక్.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీ.బీజేపీ ప్లాన్?

by Disha Web Desk 2 |
ఇంటర్నల్ ఆపరేషన్‌ లీక్.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీ.బీజేపీ ప్లాన్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని తమ సర్కారును కూల్చేందుకు బీజేపీ ఇంటర్నల్ ఆపరేషన్‌ను మొదలు పెట్టిందని కాంగ్రెస్ అనుమానిస్తున్నది. తమను దెబ్బతీసేందుకు బీజేపీ ఫస్ట్ స్టెప్ కూడా వేసిందని ‘హస్తం’ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతున్నది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వరుస కామెంట్లు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. గతంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ అమలు చేసిన విధానాలను తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేసే ప్రమాదమున్నదని ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర సర్కారును అలర్ట్ చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇక తన రాజకీయ స్ట్రాటజీని ప్రదర్శిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రాథమిక చర్చలు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యేలు, త్వరలోనే ఫైనల్ నిర్ణయం తీసుకొని పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.

అయితే ఇద్దరు ఎమ్మెల్యేలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని ఏఐసీసీ నుంచి రాష్ట్ర పార్టీకి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఆ ఇద్దరు ఎవరనేది? ఇప్పుడు ఇటు కాంగ్రెస్ తో పాటు, బీఆర్ఎస్ లోని కీలక నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీంతో పాటు జిల్లాల్లోనూ మరి కొందరి ఎమ్మెల్యేలకు చేరికలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లోపు ఫేజ్ ల వారీగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు నొక్కి చెబుతున్నారు. బీజేపీతోపాటు కేసీఆర్ కు రాజకీయ దెబ్బ రుచి చూపేందుకు తాము రెడీ గా ఉన్నామని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ పదునైన వ్యూహాలను ప్రయోగిస్తున్నట్లు ‘రేవంత్ సీక్రెట్ ఆపరేషన్ టీమ్’ కు చెందిన ఒక కీలక నేత చెప్పారు.

64 మంది ఉన్నప్పటికీ!

సీపీఐతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ 64, సీపీఐ ఒక సీటు గెలుపొందాయి. దీంతో కాంగ్రెస్ కూటమికి ప్రస్తుతం 65 సీట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ 39, ఎంఐఎం, బీజేపీ కలిపి 15 మంది సభ్యులు గెలిచారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాయనేది కాంగ్రెస్ వాదన. కేంద్రంలోని బీజేపీ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నదని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. దీంతో ముందు జాగ్రత్తతో బీజేపీ, బీఆర్ఎస్ ల ఆపరేషన్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ఫిక్స్ కావడం గమనార్హం. రాష్ట్రంలో పవర్ లో ఉన్నందున ఈ టాస్క్ ఈజీ అనేది పార్టీ బలంగా నమ్ముతున్నది.

రూల్ పెట్టుకున్నప్పటికీ...

బీఆర్ఎస్ తప్పిదాలు తాము చేయకూడదని కాంగ్రెస్ గతంలో సూత్రపాయ నిర్ణయం తీసుకున్నది. కార్యక్రమాలు, స్కీమ్ లు, పరిపాలనలో అన్ని సక్రమంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మానిటరింగ్ చేస్తున్నారు. అయితే పార్టీ విధానాలకు వచ్చే సరికి మాత్రం గతంలో పవర్ లో ఉన్న పార్టీ అనుసరించిన విధానాలను పాటించడం అనివార్యమైంది. 2014లో టీడీపీ నుంచి 12, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, వైసీపీ నుంచి ముగ్గురు, బీఎస్సీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎమ్మెల్యేకు గులాబీ కండువా కప్పారు.. 2018లో కాంగ్రెస్ నుంచి 12 మంది, తెలుగుదేశం నుంచి 2, మరో ఇద్దరు ఇండిపెండెంట్లను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు.

ఇదే సీన్ రిపీట్ చేసి కేసీఆర్ కు రాజకీయ దెబ్బ చూపించాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసేందుకు అవసరమైన 26 ఎమ్మెల్యేలను విడతల వారీగా కాంగ్రెస్ లోకి చేర్చుకోనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లు మాత్రమే మిగిలేలా భారీ స్థాయిలో జాయినింగ్స్ ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. అంతేగాక మండలిలోనూ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లోకి లాగేయాలని కీలక నేతలు ఇంటర్నల్ నిర్ణయం తీసుకున్నారు. కవిత తప్పా, మిగతా అందరినీ చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఏడాది లోపు బీఆర్ఎస్ లో 2 బీహెచ్ కే మాత్రమే మిగులుతారు.. 2 బీ అంటే బాపు, బేటా, హెచ్ హరీశ్, కే కవిత’ అంటూ వైరల్ చేశారు. ఈ ట్వీట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక కార్యకర్తలందరికీ మనోధైర్యం కోల్పోయేలా చేస్తుందనేది పోలిటికల్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

తప్పనిసరి పరిస్థితుల్లోనే..

పార్టీ ఫిరాయింపులపై గత ప్రభుత్వంపై కాంగ్రెస్ అనేక సార్లు విరుచుకుపడింది. కొన్ని సందర్భాల్లో ‘సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్నారు.’ అంటూ ప్రస్తుత సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక సార్లు విమర్శించారు. ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను బీఆర్ఎస్ లోకి చేర్చుకోవడమే కాకుండా, ప్రాజెక్టులు, స్కీమ్ లలో భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రాష్ట్రాన్ని ఏకంగా 9 లక్షల కోట్లు అప్పుల్లోకి నెట్టేసిందని మండిపడుతున్నారు. కానీ తమ సర్కార్ అలాంటి విధానాలను అనుసరించదని ఓ ఎమ్మెల్యే చెప్పారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లు చుట్టూ తిరిగింది మరిచారా..?: రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకునేందుకు గతంలో కేటీఆర్, హరీశ్ రావులు ఆయా ఎమ్మెల్యేల చుట్టు తిరిగింది మరిచిపోయారా? టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకోలేదా? కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ని మంత్రివర్గంలోకి తీసుకోలేదా? అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకున్నారా? కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపై ఒక్క సారి కూడా కనీసం విచారణ కూడా చేయలేదు. తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలని భావించడం లేదు. కానీ ఆ రెండు పార్టీలపై అనుమానంతోనే జాయినింగ్స్ ను షురూ చేశాం. దెబ్బకు దెబ్బ తీస్తాం. ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో మాకు తెలుసు.

Next Story

Most Viewed