- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BRSకు మరో బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా
దిశ, వైరా : పార్లమెంట్ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు ఫ్యాక్స్ ద్వారా, జిల్లా అధ్యక్షుడు తాతా మధుకు నేరుగా శుక్రవారం పంపారు. 2018 సంవత్సరం ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన రాములు నాయక్ అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్పై విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం రాములు నాయక్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వైరా టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్కు కాకుండా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్కు కేటాయించారు. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన అప్పటి ఓ మంత్రి రాములు నాయక్కు టికెట్ రాకుండా కీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. టికెట్ రానప్పటికి రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీ పెద్దల బుజ్జగింపుతో అదే పార్టీలో కొనసాగారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా టికెట్ రాకపోయినా పార్టీ విధేయుడిగా పని చేశారు. అయితే కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై రాములు నాయక్ అసంతృప్తిగా ఉన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో విధేయుడుగా పనిచేసినప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జి వ్యవహారంలో ప్రాధాన్యత కల్పించలేదని ఆగ్రహంతో ఉన్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలిసి బుధవారం రాత్రి ఖమ్మంలోని రాములు నా యక్ ఇంటికి చేరుకొని దాదాపు మూడు గంటలసేపు ఆయనను బుజ్జగించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సమయంలో తన అసంతృప్తిని రాములునాయక్ వ్యక్తంచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తనకు టికెట్ ఇవ్వకుండా తనపై ఓడిపోయిన మదన్ లాల్కు టికెట్టు ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ సమయంలో తనకు ఎందుకు అండగాలేరని వారిని నిలదీశారు. స్వతంత్ర అభ్యర్థిగా తనపై, కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో ఓడిపోయిన మదన్ లాల్కు వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేగా గెలిచి ఉన్న తనను కాదని ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయిన మదన్ లాల్ ను ఎలా ఇన్చార్జ్గా నియమించారని ఎంపీలను ప్రశ్నించారు. వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి మదన్ లాల్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన అప్పులను ప్రస్తుత ఎంపీ ఎన్నికల సమయంలో వచ్చే నిధులతో తీర్చేందుకు మదన్ లాల్ ప్రయత్నిస్తున్నారని కూడా రాములనాయక్ ఆరోపించారు. అనంతరం ఎంపీలు బుజ్జగించిన రాముల నాయక్ తన నిర్ణయాన్ని మార్చుకోనని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే శుక్రవారం ఉదయం రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
కాంగ్రెస్లో చేరనున్న రాములు నాయక్ ...
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో గతంలో తనకు ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్ పార్టీలో రాములు నాయక్ చేరతారని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే రాజీనామా చేసిన రాములు నాయక్ మాత్రం తాను ఇంతవరకు రాజకీయంగా భవిష్యత్ నిర్ణయాన్ని తీసుకోలేదని చెబుతున్నారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే రాములు నాయక్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.