పప్పులో కాలు.. నోరు జారిన మంత్రి తలసాని

by  |
Minister Talasani Srinivas Yadav
X

దిశ, సిటీ బ్యూరో: రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అర్థరహితమైన, ప్రజలను అయోమయానికి గురి చేసే వ్యాఖ్యలు చేశారు. మహానగరంలోని శివారు ప్రాంతాలకు తాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు, సీవరేజీ నీటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. 5వేల కోట్లను విడుదల చేస్తూ జీవోలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు శనివారం ఖైరతాబాద్ లోని జలమండలి ఆఫీసులో హోం మంత్రి మహామూద్ అలీతో కలిసి మంత్రి తలసాని విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీలో 25 ఎస్టీపీలున్నాయని, చాలా కాలంగా ఉన్నాయన్నారు.

పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే 20 ఏళ్లకు సరిపడే ప్రణాళికను తయారు చేయాలన్న ఒక ఉద్దేశ్యంతోనే షా కన్సల్టెన్సీని నియమించినట్లు చెప్పారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తారంగా పెరిగిపోతుందని, ఇంచుమించు హెచ్ఎండీ పరిధిని దాటే పరిస్ధితి దాకా వచ్చిందని వ్యాఖ్యానించడం అక్కడున్న అధికారులను, సామాన్య ప్రజలను ఒకింత అయోమయానికి గురి చేసింది. ప్రస్తుత రాష్ట్ర విభజన చట్టం నిర్ణయించిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి ఐదు ఉమ్మడి జిల్లాలకు విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ పరిధిని, కేవలం 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పరిమితమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఏ రకంగా హెచ్ఎండీఏను దాటే పరిస్థితి వచ్చిందని నిర్ఘాంతపోవటం అధికారుల వంతైంది. రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వారికి కనీసం గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏల విస్తీర్ణంపై అవగాహన లేకుండా మాట్లాడటం పట్ల కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed