వలస కార్మికుల జాబితా రూపొందించండి : సుప్రీం

by  |
వలస కార్మికుల జాబితా రూపొందించండి : సుప్రీం
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న వలస కార్మికులు సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. ఇంకా ఇతర రాష్ట్రాల్లో మిగిలిపోయిన వారిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని పంపించాలని.. స్వస్థలాలకు చేరుకున్న కార్మికుల వివరాలను, వారి వృత్తి నైపుణ్యాన్ని పేర్కొంటూ గ్రామస్థాయి నుంచే జాబితా రూపొందించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. మూడు వారాల్లోపు ఈ ప్రక్రియ పూర్తికావాలని తేల్చిచెప్పింది. వలస కార్మికుల కష్టాలపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేస్తూ కొన్ని సూచనలు చేసింది.

ఇంకా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఉన్న వలస కార్మికులను గుర్తించి వారివారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్‌కె కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి గుమికూడారని, జాతీయ రహదారుల మీద నడుచుకుంటూ వెళ్తున్నారని పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఇంకా కార్మికులను స్వస్థలాలకు తరలించాల్సి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు 24 గంటల వ్యవధిలో శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను సిద్ధం చేయాలని రైల్వే శాఖను ఆదేశించింది.

వలస కార్మికుల సమస్యలను తీర్చడానికి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. సొంతూళ్ళకు తిరిగి వచ్చిన వలస కార్మికుల వివరాలను, గతంలో ఎక్కడ పని చేశారు, ఏం పని చేశారు, వారి వృత్తి నైపుణ్యం ఏంటి తదితరాలన్నింటినీ పక్కాగా జాబితా రూపంలో గ్రామస్థాయి నుంచే తయారుచేయాలని, మూడు వారాల్లో ఈ పని పూర్తికావాలని స్పష్టం చేసింది. ఇప్పుడు సొంతూళ్ళలో ఉంటున్న కార్మికులకు తగిన ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, వారి స్కిల్ మ్యాపింగ్ వివరాలను సిద్దం చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొంది.అంతేకాకుండా సొంతూళ్ళకు వెళ్ళేవారి కోసం అవసరాన్ని బట్టి కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

వలస కార్మికులను తరలించే సమయంలో వారికి ఛార్జీల భారం ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వాలే సిద్దం చేయాలని, ప్రయాణంలో వారికి అవసరమైన ఆహారపదార్ధాలు, నీరు లాంటివి అందజేయాలని, వలస కార్మికులు పేర్లను నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకునే ప్రక్రియ సులభతరంగా ఉండేలా చూడాలని ఆదేశించింది. రోడ్లపై నడిచివెళ్తున్నవారిని గుర్తించి షెల్టర్లకు తరలించి ప్రయాణ ఏర్పాట్లు చేయాలని సూచించింది. బీహార్‌లో వలస కార్మికుల జాబితా తయారీ కోసం రూపొందించిన మొబైల్ యాప్ గురించి ఆ రాష్ట్రం తరఫున హాజరైన న్యాయవాది వివరించారు.



Next Story

Most Viewed