వన్డేలు మరీ బోర్ కొడుతున్నాయ్.. లిటిల్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 1 |
వన్డేలు మరీ బోర్ కొడుతున్నాయ్.. లిటిల్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాల పాటు శాసించిన టెస్టు క్రికెట్‌కు ప్రత్యేక స్థానముంది. అయితే, వన్డే ఫార్మాట్ మొదట 60 ఓవర్లను తీసుకొచ్చాక టెస్టు క్రికెట్‌కు క్రమంగా ఆదరణ తగ్గుతూ వచ్చింది. వన్డే క్రికెట్‌లో నిబంధనల సవరణ, ఈ ఫార్మాట్‌కు ఉన్న క్రేజ్ వల్ల ఇది కూడా సుమారు నాలుగు దశాబ్దాలపాటు ఒక ఊపు ఊపింది. 1970ల నుంచి 2010వ దశకం వరకూ వన్డేలదే హవా. కానీ టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో వన్డేలు మనుగడ సాధించడమే కష్టమవుతోంది. మరీ ముఖ్యంగా గడిచిన నాలుగైదేళ్లలో వన్డేలు క్రమంగా అంతరించే దశకూ చేరుకున్నాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా వన్డే క్రికెట్ లో కూడా మార్పులు చేయాలని కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ లో కూడా చర్చ జోరుగా సాగుతోంది. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. వన్డేలను 50 ఓవర్లుగా కాకుండా 40 ఓవర్లకు కుదించాలని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇదే విషయమై టీమిండియా దిగ్గజ క్రికెటర్.. వన్డేలలో మరెవరి పేరిట లేని రికార్డులను నెలకొల్పిన మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్ లో కూడా మార్పులు అవసరమని.. లేకుంటే వన్డేల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ మాట్లాడుతూ.. ‘గత కొన్నాళ్లుగా వన్డే క్రికెట్ లో ఎలాంటి మార్పులూ రావడం లేదు. వన్డే క్రికెట్ ను బతికించుకోవాలంటే మార్పులు తప్పనిసరి. నిబంధనల ప్రకారం రెండు కొత్త బంతులను తీసుకోవడం వల్ల వాటిని రివర్స్ స్వింగ్ చేసే అవకాశం బౌలర్లకు లభించడం లేదు. ఈ కారణంగా మ్యాచ్ 15 ఓవర్ నుంచి 40వ ఓవర్ వరకూ మ్యాచ్ లు మరీ బోర్ కొడుతున్నాయి. అందుకే టెస్టుల్లో మాదిరిగా వన్డే ఫార్మాట్ నూ రెండు ఇన్నింగ్స్ లు అంటే ప్రతీ 25 ఓవర్లకు ఒకటిగా విడదీసి ఆడించాలి. అప్పుడు ఆట రసవత్తరంగా సాగుతుంది. అంతేగాక వాణిజ్య పరంగా కూడా కలిసొస్తుంది’ అని తెలిపాడు.

Also Read..

ఆర్సీబీలోకి న్యూజిలాండ్ డేర్ అండ్ డాషింగ్ ఆల్ రౌండర్..!


Next Story

Most Viewed