అర్ష్‌దీప్‌ను అవమానించిన పాక్ క్రికెటర్.. హర్భజన్ దెబ్బకు క్షమాపణలు

by Harish |
అర్ష్‌దీప్‌ను అవమానించిన పాక్ క్రికెటర్.. హర్భజన్ దెబ్బకు క్షమాపణలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను హేళన చేస్తూ సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ క్షమాపణలు చెప్పాడు. సిక్కు కమ్యూనిటీ తనను క్షమించాలని కోరాడు. అసలేం జరిగిందంటే.. ఇటీవల భారత్, పాక్ మ్యాచ్‌ సందర్భంగా ఓ న్యూస్ చానెల్‌ డిబేట్‌లో పాల్గొన్న అక్మల్.. పాక్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌‌‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సిక్కు‌లను అవమానపరిచేలా ఉన్న అతని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ అక్మల్‌‌ను కడిగిపారేశాడు. ‘అక్మల్ మీ చెత్త నోరు తెరిచే ముందు సిక్కుల చరిత్ర తెలుసుకోవాలి. మీ తల్లులు, సోదరీమణులను ఆక్రమణదారులు అపహరించినప్పుడు సమయం 12:00 గంటలే. సిక్కులమైన మేమే వారిని రక్షించాం. సిగ్గుపడండి. కాస్తయినా కృతజ్ఞత ఉండాలి.’ అని అక్మల్‌‌కు గడ్డిపెట్టాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా అక్మల్ క్షమాపణలు కోరాడు. ‘నా వ్యాఖ్యలు అగౌరవంగా ఉన్నాయి. హర్భజన్ సింగ్, సిక్కు కమ్యూనిటికీ క్షమాపణలు చెబుతున్నాను. సిక్కులపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఎవరినీ బాధపట్టాలనే ఉద్దేశంతో అనలేదు. నన్ను క్షమించండి’ అని రాసుకొచ్చాడు.



Next Story

Most Viewed