మార్కెట్లకు బడ్జెట్ టీకా!

by  |
మార్కెట్లకు బడ్జెట్ టీకా!
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య సంరక్షణ కోసం భారీగా కెటాయింపులను ప్రకటించడంతో సోమవారం స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిఓ దూసుకెళ్లాయి. గత రెండు వారాలుగా కుప్పకూలిన సూచీలకు బడ్జెట్ టీకా బాగానే పనిచేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో సామాన్య జీవులకు పెద్దగా ఎలాంటి ఊరట కలిగించే అంశాలు, వేతజీవులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పన్ను శ్లాబుల మార్పులు లేకపోయినప్పటికీ మార్కెట్లు అద్భుతంగా ర్యాలీ చేశాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగానికి నిధులను రెట్టింపు చేయడంతో పాటు బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచడంతో ఈక్విటీ మార్కెట్లు ఏకంగా 5 శాతం ఎగిశాయి. నిఫ్టీ సైతం దాదాపు 5 శాతం వరకు ర్యాలీ చేసింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,314.84 పాయింట్లు దూసుకెళ్లి 48,600 వద్ద ముగియగా, నిఫ్టీ 646.60 పాయింట్లు ఎగసి 14,281 వద్ద ముగిసింది. నిఫ్టీలో అన్ని రంగాలు బలపడగా, ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు అధికంగా ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా రెడ్డీస్, టెక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు మాత్రమే డీలాపడగా, మిగీన అన్ని షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆల్ట్రా సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, టైటాన్ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి.

మార్కెట్ల ర్యాలీకి కారణాలు…

బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితి పెంపు..
కరోనా సమయంలో విదేశీ పెట్టుబడులు ఎక్కువగా భారత్‌లోకి ప్రవేశిస్తుండటంతో ప్రభుత్వ ఎఫ్‌డీఐల విష్యంలో స్పీడ్ పెంచింది. జీవిత బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతేకాకుండా యాజమాన్యం విషయంలో సరళమైన నిబంధనలు, జీవిత బీమా చట్టంలో సవరణలు ప్రతిపాదించారు. దీంతో ఈ రంగానికి చెందిన షేర్లు భారీగా ట్రేడయ్యాయి.

పెట్టుబడుల ఉపసంహరణ…

గతేడాది ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కరోనా వల్ల తగ్గిన నేపథ్యంలో ఈసారి దీని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, బ్యాంకులకు మూలధన నిధులను ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. అదేవిధంగా కీలకమైన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే, ఓ బీమా కంపెనీని కూడా ప్రైవేటీకరించనున్నట్టు తెలిపారు.

పన్నుల ఊరట..

కరోనా కారణంగా ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో కరోనా సెస్ విధిస్తారనే వార్త ఇటీవల వినిపించింది. అయితే, బడ్జెట్లో ప్రస్తావనే లేదు. అంతేకాకుండా, ఆదాయం ఈ బడ్జెట్‌లో ఆధారపడకపోవడంతో ఆర్థికవ్యవస్థలో నగదు లభ్యత పెరుగుతుందనే సంకేతాలు మార్కెట్లలో కనిపించింది.

తుక్కు పాలసీతో ఆటో రంగం జోష్..

కొన్నేళ్లుగా ఆటో రంగం నుంచి ప్రభుత్వానికి తరచుగా వినిపిస్తున్న ప్రతిపాదన తుక్కు పాలసీని తీసుకురావాలని. పరిశ్రమలో డిమాండ్‌ను పెంచేందుకు ఈ స్క్రాపేజ్ పాలసీ కీలకమని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్‌లో వ్యక్తిగత వాహనాల జీవిత కాలాన్ని 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వాయు కాలుష్యాన్ని నివారించడానికి రూ. 2,217 కోట్లను కేటాయించారు. ఈ నిర్ణయాలతో ఆటో రంగం షేర్లు ఏకంగా 6 శాతానికిపైగా ర్యాలీ చేశాయి.

ఎల్ఐసీ ఐపీవో వార్త..

గతేడాది ఎల్ఐసీ ఐపీఓకు రావాల్సి ఉండగా ఆలస్యమైంది. ఈ ఏడాది అది జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. ఎల్ఐసీ ఐపీఓకు రావడం వల్ల ప్రభుత్వం ఈ ఏడాదిలో మార్కెట్ ప్రతికూల నిర్ణయాలు ఉండకపోవచ్చని ఇన్వెస్టర్లు భావించారు. దీంతో సూచీలు భారీగా ఎగిశాయి.



Next Story

Most Viewed