ఆగమేఘాల మీద కొంగొత్తగా ఆర్టీసీ.. కారణమేమంటే..?

by  |
ఆగమేఘాల మీద కొంగొత్తగా ఆర్టీసీ.. కారణమేమంటే..?
X

దిశ, న్యూస్‌‌బ్యూరో: ఆదాయం కోసం ఆర్టీసీ ప్రత్యామ్నాయం కోసం శోధిస్తోంది. ఖాళీగా ఉన్న ఉద్యోగులకు ఊరికే ఎలా జీతాలు ఇవ్వాలనే ఆలోచనలో పడింది..! ఈ మేరకు ఆదాయం సమకూర్చుకోవడానికి అడుగులు వేసే పనిలో పడింది. కరోనా వైరస్​ కాలంలో అక్యూపెన్సీ రేషియా(ఓఆర్)​ పెరిగి, బస్సులు పూర్తిగా తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులను వేరే విధంగా వాడుకొని ప్రొడక్టివిటీ పెంచుకోవాలనుకుంటుంది. చాలా రోజులుగా పెండింగ్​లో ఉన్న కార్గో, పార్సిల్ సర్వీసులను ఆగమేఘాల మీద అధికారులు ప్రారంభించిన తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ లాజిస్టిక్ సర్వీసుల ద్వారా సంస్థ ఆదాయాన్ని ఇప్పుడున్నదాని కన్నా మరో రూ.200 కోట్ల వరకు పెంచుకోవాలనుకోవడం ఒక కారణమైతే పూర్తిస్థాయి లాక్‌డౌన్ తర్వాత కూడా మొత్తం బస్సులు తిరగక ఖాళీగా ఉన్న చాలా మంది ఉద్యోగులను ఎలాగైనా వాడుకొని సంస్థ ఆర్థిక పరిస్థితిని ఓ కొలిక్కి తీసుకురావాలనుకోవడం మరో కారణమని పలువురు కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

గాడిన పడేందుకే..!

గతేడాది ఆర్టీసీ సమ్మె జరిగిన తర్వాత ఓ వైపు చార్జీలు పెంచి మరోవైపు కార్గో సర్వీసులను ప్రవేశపెట్టి సంస్థ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నట్లుగానే కొంత మేర ఆదాయాన్ని పెంచుకొని ఖర్చులకు, ఆదాయాన్ని సమాన స్థాయికి వచ్చేలా చర్యలు తీసుకోవడంలో సఫలమైంది. దీంతో పాటే కార్గో బస్సులను సైతం వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కరోనా నిరోధానికి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయి బస్సులు మొత్తం సుమారు రెండు నెలల పాటు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో సంస్థ ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అనంతరం లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కేవలం జిల్లాల్లో మాత్రమే తిరుగుతున్నాయి. సిటీ సర్వీసులు, అంతర్ రాష్ట్ర సర్వీసులు లేక అధికంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఖాళీగా ఉన్న ఉద్యోగులకు సైతం ప్రతి నెలా సగం జీతాలు చెల్లించాల్సి వస్తోంది. ఈ జీతాలకే సంస్థకు రూ.120 కోట్ల దాకా ఖర్చవుతున్నట్లు సమాచారం.

కార్గో సేవలు..

కార్గో సేవల కోసం ప్రత్యేకంగా 200 మందిని నియమించుకున్న సంస్థ లాక్‌డౌన్ సమయంలోనే ఈ సేవలను ప్రారంభించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సరుకులను ప్రయోగాత్మకంగా రవాణా చేసింది. తాజాగా లాక్‌డౌన్ కారణంగా బస్సులు పూర్తిగా తిరగక ఖాళీగా ఉన్న రెగ్యులర్ ఉద్యోగుల్లో నుంచి 1200 మంది డ్రైవర్లు, ఇతర సిబ్బందిని పార్సిల్ సర్వీసుల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, బుకింగ్ కేంద్రాల నిర్వాహకులుగా వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. సంస్థలో ఉద్యోగులకు ప్రతి నెల రూ.240 కోట్లు చెల్లించాల్సి వస్తుండడంతో ఈ నిధులైనా సంస్థ సమకూర్చుకోవడానికి అందుబాటులో ఉన్న ఉద్యోగులతోనే కొత్త వ్యాపారంలోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు ఒక అధికారి పేర్కొన్నారు. పార్సిల్ సర్వీసులను సొంతగానే ప్రారంభించి ప్యాసింజర్ సర్వీసుల్లో ఉద్యోగులను తగ్గించి లాజిస్టిక్స్ విభాగంలో పర్మినెంట్‌గా కొంత మందిని వాడుకోవాలని ఉన్నతాధికారుల ఆలోచనగా ఆయన చెప్పారు. ఈ కారణంతోనే సంస్థతో చాలా రోజుల నుంచి అసోసియేట్ అయి పార్సిల్ సేవలు అందిస్తున్న ఎస్.ఎస్ సర్వీసెస్ లిమిటెడ్‌కు కాంట్రాక్టు రద్దు చేసి మొత్తం పార్సిల్ సర్వీసుల నిర్వహణను ఆర్టీసీనే భుజానికెత్తుకోవడం ఈ వ్యూహంలో భాగమేనని ఆయన చెప్పారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఈ సర్వీసులను ఇప్పటికే అక్కడి ఆర్టీసీ సొంతగా నిర్వహిస్తూ రూ.200 కోట్ల దాకా ఏటా సంపాదిస్తున్న అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాతే టీఎస్ ఆర్టీసీ అధికారులు కొరియర్, కార్గో, పార్సిల్ సర్వీసులను ఆగమేఘాల మీద ప్రారంభించినట్లు చెబుతున్నారు.

Next Story