అరటిపండ్ల వ్యాపారి ఇంట్లో రూ.1.07కోట్లు సీజ్..

by  |
అరటిపండ్ల వ్యాపారి ఇంట్లో రూ.1.07కోట్లు సీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్ :

అరటిపండ్ల వ్యాపారి ఇంట్లో రూ.1.07 కోట్లు లభ్యమయ్యాయి. సరైన పత్రాలు చూపించని కారణంగా టాస్క్‌ఫోర్సు పోలీసులు ఆ నగదును సీజ్ చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని శివనగర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. అది కాస్త స్థానికంగా సంచలనం సృష్టించింది.

వివరాల్లోకివెళితే.. శివనగర్‌లో ఉంటున్న అరటిపండ్ల వ్యాపారి కొవ్వూరి మధు సూదన్‌రెడ్డి ఇంట్లో రూ.1.07 కోట్ల నగదును టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు నందిరాంనాయక్, మధు పట్టుకున్నారు. ఆయనకు సంబంధించిన అరటి పండ్ల డీసీఎం మదనపల్లి నుంచి వరంగల్‌కు ఆదివారం అర్ధరాత్రి బయలు దేరగా, అందులో పెద్ద మొత్తంలో సరైన పత్రాలు లేని నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

దీంతో సోమవారం ఉదయం మిల్స్‌కాలనీ పోలీసు‌స్టేషన్‌ వద్ద డీసీఎంను ఆపి తనిఖీలు నిర్వహించగా అందులో డబ్బు లభించలేదు. అనంతరం శివనగర్‌లోని మధుసూదన్‌రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా రూ.1.07 కోట్ల నగదు దొరికింది. ఆ నగదుకు సంబంధించి సరైన పత్రాలు అడిగితే మధు సూదన్ రెడ్డి చూపించలేదు. దీంతో ఆ మొత్తం డబ్బును సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed