పాఠశాలకు రాకున్నా.. ప్రమోట్ చేయాల్సిందే

by  |
పాఠశాలకు రాకున్నా.. ప్రమోట్ చేయాల్సిందే
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థులు పాఠశాలకు రాకున్నా ప్రమోట్ చేయాల్సిందేనని పేరెంట్స్ అసోసియేషన్స్ పట్టుబడుతున్నాయి. ఒకటో తేదీ నుంచి తరగతి బోధన కోసం పిల్లలను పంపించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. దాదాపు ఐదు నెలల నుంచి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తుండటంతో అదే విధంగా పరీక్షలు కూడా నిర్వహించాలని కోరుతున్నారు. భౌతిక తరగతులంటూ పిల్లలను ఇబ్బంది పెట్టొద్దని విన్నవిస్తున్నారు.

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తొమ్మిది, పది తరగతులకు భౌతిక క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే నెలలో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులను కూడా పాఠశాలలకు రప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు క్లాసుల పేరుతో ఫీజులు వసూళ్లకు దిగుతున్నాయి. తల్లిదండ్రులు కూడా కరోనా భయంతోపాటు ఫీజులు చెల్లించేందుకూ ఇబ్బందులు పడుతున్నారు.

విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, టీవీల లాంటివి సమకూర్చుకోవడం కోసం తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వచ్చింది. ఇద్దరు చదువుకునే పిల్లలున్న ఒక్కో కుటుంబం ఆన్‌లైన్ క్లాసుల కోసం కనిష్ఠంగా రూ.30వేలు ఖర్చు చేసినట్టు నిరూపితమవుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఫిజికల్ క్లాసులంటే ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు ట్రావెల్, పుస్తకాలు, డొనేషన్ల పేరుతో ఫీజులను మరింత పెంచుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డిజిటల్ పాఠాలు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ విద్యార్థులు కూడా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయడంతో వారికి ఆన్‌లైన్ క్లాసులకు ఇబ్బందులు ఉండని స్థితిలో భౌతిక తరగతుల అవసరమేమిటని తల్లిదండ్రుల ప్రశ్నిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం డిజిటల్ పద్ధతిలోనే పూర్తి చేసి జూన్ నుంచి పూర్తి స్థాయిలో క్లాస్ రూం బోధన ప్రారంభిస్తే ఎలాంటి గందరగోళం ఉండదని పేరెంట్స్ అసోసియేషన్స్ వాదిస్తున్నాయి.

కొవిడ్ నిబంధనల అమలు కష్టం!

ఉపాధ్యాయులు, విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి ఒకే తరగతి గదిలో రోజంతా గడపాల్సి ఉంటుంది. చిన్న పిల్లలను కొవిడ్ జాగ్రత్త చర్యలు పాటించేలా నిరంతరం పర్యవేక్షించడం కూడా కష్టమవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ద్వారా వైరస్ పిల్లలకు వస్తే గుర్తించడం కూడా కష్టమవుతుందని వారు చెబుతున్నారు. అన్ని విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నందున అదే పద్ధతిలో పరీక్షలు కూడా నిర్వహించాలని వారు కోరుతున్నారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎనిమిదో తరగతి లోపు విద్యార్థులను ఒకే తరగతిలో ఉంచకూడదని ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని, వాటిని అమలు చేస్తే సరిపోతుందని పేరెంట్స్ సంఘాలు చెబుతున్నాయి

ఆన్‌లైన్ క్లాసులే కొనసాగించాలి

విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు అవసరమైన టెక్నాలజీని తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. ఇంటివద్ద నుంచే విద్యార్థులతో పరీక్షలకు హాజరయ్యేలా చూడాలి. విద్యార్థులు స్కూల్‌కు వెళ్లడం వల్ల తల్లిదండ్రులకు కొత్త భయాలు వస్తున్నాయి. కొత్త అకాడమిక్ ఇయర్‌లో మొదటి నుంచి భౌతిక తరగతులు నిర్వహిస్తే ఎవరికీ గందరగోళం, ఇబ్బందులు ఉండవు. విద్యాశాఖ ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. – వెంకట్, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్



Next Story