ఒలింపిక్ విలేజ్.. సౌకర్యాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by  |
ఒలింపిక్ విలేజ్.. సౌకర్యాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ క్రీడాభిమానునలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒలింపిక్స్ 2020 మరో మూడు వారాల్లో ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా గత ఏడాది టోక్యో వేదికగా జరగాల్సిన విశ్వ క్రీడలను 23 జులై 2021 నుంచి ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రీడల కోసం ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నిబంధనల నడుమ అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఒలింపిక్స్ నిర్వహించనున్నారు. జపాన్ ప్రభుత్వం, టోక్యో మెట్రోపాలిటన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ క్రీడల కోసం రూ. వేల కోట్లు వెచ్చించాయి. స్టేడియంలు, క్రీడా గ్రామంతో పాటు ఇతర సౌకర్యాల కోసం భారీగా ఖర్చు చేసింది. క్రీడా మహోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో ఇటీవలే నిర్వాహక కమిటీ మీడియాను ఒలింపిక్ విలేజ్‌లోకి తీసుకొని వెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను చూపించింది. ఒక ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో అథ్లెట్ల కోసం అన్ని సౌకర్యాలను క్రీడాగ్రామంలో ఏర్పాటు చేసింది.

క్రీడా గ్రామం ఇలా..

జపాన్ రాజధాని టోక్యోలో భారీ ఖర్చుతో ఒలింపిక్ గ్రామాన్ని నిర్మించారు. సముద్రాన్ని పూడ్చి కొత్తగా సృష్టించిన భూభాగంలోనే ఈ ఒలింపిక్ విలేజ్ నిర్మించడం విశేషం. దాదాపు 110 ఎకరాల విస్తీర్ణంలో 10 వేల మంది ఒలింపిక్ అథ్లెట్లకు సరిపడా అపార్ట్‌మెంట్లను నిర్మించారు. అంతే కాకుండా పారా ఒలింపిక్స్ సందర్భంగా పాల్గొనే వికలాంగ అథ్లెట్లు కూడా ఉపయోగించుకునేలా ఈ గ్రామాన్ని నిర్మించారు. ఈ క్రీడా గ్రామాన్ని నిర్మించడానికి 54 బిలియన్ యెన్స్ (రూ. 36 వేల కోట్లు) ఖర్చు చేశారు. ఈ క్రీడాగ్రామంలో మొత్తం 12 బిల్డింగ్స్ ఉన్నాయి. అథ్లెట్లు నివసించే సర్వీస్ అపార్ట్‌మెంట్లతో పాటు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, 5 స్టార్ హోటల్, రెస్టారెంట్, బ్యాంకు, కొరియర్ సర్వీస్, రిక్రియేషన్ సెంటర్‌లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యాంకు, పోస్టాఫీస్‌లలో ఉద్యోగులు ఎక్కువగా ఉండరు. అంతా ఆటో టెల్లర్ మెషిన్ల ద్వారానే పని జరిగిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతీ ఫ్లోర్‌లో డ్రై క్లీనింగ్ మెషిన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక అథ్లెట్లు క్రీడా గ్రామం నుంచి స్టేడియంలకు వెల్లడానికి ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ మినీ బస్సులను సిద్దంగా ఉంచారు. అసలు ఎలాంటి వాయు, శబ్ద కాలుష్యం లేకుండా నిత్యం ఈ బస్సులు అథ్లెట్లను చేరవేసే పనిలో నిమగ్నమై ఉంటాయి.

తర్వాతేం చేస్తారు..?

ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన షాపింగ్ ఏరియా కోసం 2.4 బిలియన్ యెన్‌లు ఖర్చు చేశారు. ఇందుకోసం ఉపయోగించిన టింబర్‌ను జపాన్‌లోని 63 మున్సిపాలిటీలు విరాళంగా అందించాయి. మొత్తం 40 వేల చెక్కలను ఇవ్వగా.. ఎవరెవరు ఇచ్చారో అనేది ఆయా చెక్కలపై రాసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మొత్తం క్రీడా గ్రామంలో తర్వాత తొలగించేది ఈ షాపింగ్ ఏరియా మాత్రమే. ఇక వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రీడాగ్రామంలోని అపార్ట్‌మెంట్లు ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ముగిసిన తర్వాత సాధారణ ప్రజలకు అమ్మకానికి పెడతారు. ఇప్పటికే 90 శాతం అపార్ట్‌మెంట్లు ప్రజలకు అమ్మేశారు. గత ఏడాదే వీటన్నింటినీ రియల్టర్ కొనుగోలు దారులకు అప్పగించాల్సి ఉన్నది. అయితే ఒలింపిక్స్ వాయిదా పడటంతో ఫ్లాట్ల అప్పగింత ఆలస్యం అయ్యింది. ఒక ఏడాది ఆలస్యంగా అప్పగిస్తున్నందుకు కొనుగోలుదారులకు డిస్కౌంట్లు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ ఒలింపిక్ విలేజ్‌లో ఏర్పాటు చేసిన పోస్టాఫీస్, బ్యాంక్ సహా మెడికల్ సెంటర్‌ను భవిష్యత్‌లో కూడా కొనసాగించనున్నారు. అక్కడ నివసించే ప్రజలకు కోసం వీటిని ఉంచనున్నట్లు స్థానిక ప్రభుత్వం స్పష్టం చేసింది.



Next Story

Most Viewed