అందని నోట్ పుస్తకాలు… తల్లిదండ్రులు ఆందోళన

by  |
అందని నోట్ పుస్తకాలు… తల్లిదండ్రులు ఆందోళన
X

దిశ, సారపాక: బూర్గంపాడు మండల వ్యాప్తంగా ప్రతి ఏడాది సారపాక ఐటీసీ కర్మాగార యాజమాన్యం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు నాణ్యమైన నోట్ పుస్తకాలు అందజేస్తారు. కాగా కరోనా సమయంలో లాక్ డౌన్ ఆంక్షల మేరకు పాఠశాలలు, కళాశాలలకు ఐటీసీ నోట్ పుస్తకాలు అందనప్పటికీ.. ఈ ఏడాది 2021 విద్యాసంవత్సరం పాఠశాలలు, కళాశాలలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీసీ యాజమాన్యం పలు పాఠశాలలకు, అదేవిధంగా బూర్గంపాడు జూనియర్ కళాశాలలకు నోట్ పుస్తకాలు అందించినప్పటికీ.. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్లు ఇంతవరకు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఒక్క నోట్ పుస్తకం కూడా ఇచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

ఇప్పటికే పిల్లలకు విద్యాసంవత్సరం ముగియడానికి కూడా సమయం ఆసన్నమైంది. విద్యార్థులకు అవసరం ఉన్న సమయంలో నోట్ పుస్తకాలు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఐటీసీ యాజమాన్యం మాత్రం నోట్ పుస్తకాలు ఇచ్చి మొక్కుబడి తీర్చుకున్నారే గాని, అవి విద్యార్థులకు అందినవో..లేవో.. కూడా తెలుకోకపోవడం గమనార్హం. ఐటీసీ యాజమాన్యం మాత్రం తాము పిల్లలకి ఇప్పటికే నోట్ బుక్స్ పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. మరి దేవుడు వరం ఇచ్చినా కరుణించని పూజారులు ఉన్నప్పుడు.. విద్యార్థులకు పుస్తకాల ప్రసాదం ఎప్పుడు లభించునో వేచి చూడాల్సిందే

Next Story