చెరువులకు గ్రహణం

by  |
చెరువులకు గ్రహణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు కనుమరుగవుతున్నాయి. చెరువులను గుర్తించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండీఏ విభాగాలు వేటికవే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వమే పరోక్షంగా చెరువులను కనుమరుగు చేస్తున్నదనే ఆరోపణలున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో ముందుగా 2,857 చెరువులను గుర్తించారు. అనంతరం మరో 275 చెరువులను కనుగొన్నారు. వీటి విస్తీర్ణం, ఎఫ్టీఎల్ పరిధులను ఖరారు చేసేందుకు దశాబ్ద కాలం పట్టింది. చెరువులకు ఉన్న లింకు కాలువలను గుర్తించలేదు. దీంతో లింకు కాలువలకు ఆనుకునే లేఅవుట్లు వెలిశాయి. నిర్మాణాలు కూడా వచ్చేశాయి. చాలా ప్రాంతాల్లో హెచ్ఎండీఏ అనుమతులను జారీ చేసింది. ఫలితంగా చెరువులకు ఉన్న లింకులు తెగిపోయాయి. ఇష్టారాజ్యంగా ఎన్ఓసీలు జారీ అయ్యాయి. దీంతో చెరువులు, వాగులు, కాలువలు కనుమరుగవుతున్నాయి. వర్షాకాలంలో ఎగువ, దిగువ ప్రాంతాలు జలమయమవుతున్నాయి.

పరిశీలించకుండానే..

నీటి వనరుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వంటివి సరిగ్గా పరిశీలించకుండానే ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలు ఎన్ఓసీలను జారీ చేస్తున్నాయి. నీటి వనరులు కనిపిస్తే చాలు ఎన్ఓసీ అడగడం పరిపాటిగా మారింది. సుమారు 200 వరకు కాలువలు, వాగులు, కుంటలు కాలగర్భంలో కలిసిపోయినట్టు అధికారులే చెబుతున్నారు. వెన్నలకుంట, మొఘల్ కుంట, సాహెబ్ కుంట, క్వారీ కుంటలు కనుమరుగయ్యాయి. ఫాక్స్ సాగర్, అల్వాల్ చెరువు, హస్మత్ పేట్, మైసమ్మ చెరువు, సున్నం చెరువు, బుల్ బుల్ ఖాన్ కుంట, ఎర్రకుంట, పల్లె చెరువు, సరూర్ నగర్, జల్ పల్లి, మీర్ పేట్, ఫిర్జాదీగూడ, పర్వతాపూర్ చెరువులు, బండచెరువు, రామక్రిష్ణాపురం చెరువు, నాచారం చెరువులు పూర్తిగా కుచించుకుపోయాయి. వీటి లింకు కాలువలు, వాగులపైనే కాలనీలు, నిర్మాణాలు వెలిశాయి. వీటిని నివారించాల్సిన ప్రభుత్వ, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ తీసుకు వస్తోంది. నీటి వనరుల సంరక్షణను విస్మరిస్తున్నది.



Next Story