దాహం తీర్చని ‘ఏటీఎం’

by  |
దాహం తీర్చని ‘ఏటీఎం’
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజలకు తక్కువ ధరకే స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వాటర్‌ ఏటీఎంలు అలంకారప్రాయంగా మారాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చాలా వరకు నిరుపయోగంగా తయారయ్యాయి. ప్రారంభించిన నెలరోజులు సరిగ్గానే ఉన్నా సరైన నిర్వహణ లేకపోవటంతో ఎక్కడివక్కడే మూలన పడ్డాయి. ఫలితంగా బాటసారులకు, పారిశుధ్య కార్మికులకు నీరు దొరక్క అవస్థలు ఎదుర్కొంటున్నారు.

నిర్వహణ లోపంతోనే..

వాటర్ బోర్డు ద్వారా నీటి సరఫరా చేసినా ఇబ్బందులు ఎదురవటంతో వాటర్ ఏటీఎంల ద్వారా అందించి దాహార్తిని తగ్గించొచ్చని జీహెచ్ఎంసీ భావించింది. ఇందుకోసం కేవలం ఒక్క రూపాయికి లీటర్‌ చొప్పున రూ.20కు ఇరవై లీటర్లు అందించేందుకు ఐదొందల ఏటీఎంలను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వాటర్‌ ఏటీడబ్య్లూ (ఎనీటైంవాటర్‌) అందించే సంస్థల కోసం ఎక్స్‌ఫ్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈఓఐ)ను ఆహ్వానించారు. ముందుకొచ్చిన సంస్థల్లో రెండింటిని ఎంపిక చేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం జీహెచ్ఎంసీ వాటర్‌ కియోస్క్‌ల ఏర్పాటుకు స్థలం కేటాయించింది.

ప్రస్తుతం నగరంలో వంద వరకు మాత్రమే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇవి సరిగ్గా నెలరోజులు అటూ ఇటుగా నడిచాయి. లాక్‌డౌన్‌కు తోడు నిర్వహణ లోపం కారణంగా చాలా వరకు నిరుపయోగంగా మారాయి. దీంతో స్వగ్రామానికి బయలుదేరిన వలసకూలీలకు, విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికులు దాహార్తితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నీటిలోని సహజ సిద్ధమైన మినరల్స్‌ను తొలగించకుండా స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఈ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. చాలా రోజులుగా ఎటువంటి పర్యవేక్షణ లేకపోవటంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్‌క్రాస్‌ తదితర సంస్థల నాణ్యత ప్రమాణాల మేరకు నీటిని అందిస్తామని జీహెచ్ఎంసీ చెబుతున్నా లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. మిషన్లలో నీటి లభ్యత లేక పూర్తిస్థాయిలో పనిచేయడం మానేశాయి. లాక్‌డౌన్ కారణంగా హోటళ్లు, దుకాణాలు మూత పడటంతో నీళ్లు తాగాలంటే వాటర్ ఏటీఎంలే దిక్కవుతున్నాయి. వేసవి దృష్ట్యా ఏటిఎంలను పునరుద్దరించాలని నగరవాసులు కోరుతున్నారు.

Next Story