సల్మాన్ ఖాన్ తో మహారాష్ట్ర సీఎం షిండే భేటీ..!

by Dishanational6 |
సల్మాన్ ఖాన్ తో మహారాష్ట్ర సీఎం షిండే భేటీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: లారెన్స్ బిష్ణోయ్ అంతు చూస్తామన్నారు మాహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే. బాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ఖాన్‌ తో భేటీ తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ నివాసానికి షిండే వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పలకరించారు. ఆ తర్వాత కాల్పుల పగరిణామాలపై చర్చించారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇక, సీఎం షిండే నేరుగా.. సల్మాన్ నివాసానికి రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సల్మాన్‌ఖాన్‌ను కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. సల్మాన్‌ఖాన్‌తో భేటీ తర్వాత షిండే మీడియాతో మాట్లాడారు. కాల్పుల ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ ఘటనలో ఎలాంటి ముఠా ప్రమేయం ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గ్యాంగ్‌లను, గ్యాంగ్ వార్ లను జరగడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. లారెన్స్ బిష్ణోయ్ అంతు చూస్తామని స్పష్టం చేశారు. అలాగే సల్మాన్‌ఖాన్ కుటుంబానికి భద్రత కల్పించాలని పోలీస్ కమిషనర్‌కు ఆదేశించినట్లు చెప్పారు.

ఆదివారం తెల్లవారుజామున సల్మాన్‌ఖాన్‌ నివాసంపై దుండగులు కాల్పులు జరిపారు. ఇద్దరు దండగులు బైక్‌పై వచ్చి ఐదు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు ఈనెల 25 వరకు న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు 14 రోజులు కస్టడీ కోరగా.. 9 రోజులు కస్టడీకి అంగీకరించింది కోర్టు.

ఈ ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించిందని నిందితులు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సబ్యులు. కాగా.. సింగర్ సిద్ధూమూసేవాలా, కర్ణిసేన చీఫ్ సుఖ్ దేవ్ సింగ్ గోమేడి హత్య కేసుల్లో ప్రస్తుతం తీహార్ జైళ్లో ఉన్నాడు బిష్ణోయ్.

నవంబర్ 2022 నుంచే సల్మాన్ కు వై-ప్లస్ భద్రతను ఇస్తున్నారు. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వస్తున్నాయి. అందుకే ఆయన భద్రతను వై-ప్లస్ కి పెంచారు. సల్మాన్ ఖాన్ కు తుపాకీని కూడా క్యారీ చేసే అధికారం ఇచ్చారు. సల్మాన్ అదనపు రక్షణ కోసం సాయుధ వాహనాన్ని కూడా ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.


Next Story