బీజేపీ అంటే భ్రష్ట్ జనతా పార్టీ : ఉద్ధవ్

by Dishanational6 |
బీజేపీ అంటే భ్రష్ట్ జనతా పార్టీ : ఉద్ధవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ అత్యంత అవినీతి పార్టీ అని తేలిందన్నారు శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే. ఢిల్లీలో విప‌క్ష ఇండియా కూటమి నిర్వ‌హించిన సేవ్ డెమోక్రసీ మెగా ర్యాలీలో ప్రసంగించారు. మోడీ స‌ర్కార్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ నిజస్వరూపం ప్రజల ముందు బట్టబయలైందన్నారు. బీజేపీ అత్యంత అవినీతి పార్టీ అని.. బీజేపీ అంటే భ్రష్ట జనతా పార్టీ అని మండిపడ్డారు. గతంలో బీజేపీ అవినీతి ఆరోపణలు చేసిన పలువురు నేతలు ఇటీవలే ఆ పార్టీలో చేరారని తెలిపారు. ప్రఫుల్ పటేల్ పై ఎవరు ఆరోపణలు చేశారు? ఆదర్శ్ పై ఎవరు ఆరోపణలు చేశారు? జనార్ధన్ రెడ్డి, నవీన్ జిందాల్ పై ఆరోపణలు చేసింది ఏ పార్టీ అని మండిపడ్డారు.

బీజేపీ 'మోడీ కా పరివార్' ప్రచారంపై విరుచుకుపడ్డారు ఉద్దవ్ ఠాక్రే. కొవిడ్ సమయంలో తాను సీఎంగా ఉన్నప్పుడు నా కుటుంబం, నా బాధ్యత అని తను సంకల్పించినట్లు తెలిపారు. మీ కుటుంబంలో మీరు, కుర్చీ మాత్రమే ఉన్నాయని మోడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఠాక్రే.

రాబోయే లోక్‌స‌భ ఎన్నికల్లో.. బీజేపీ 400 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందటమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఒక పార్టీ, ఒక వ్యక్తి సారథ్యంలో నడిచే నియంత ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయే టైం వచ్చిందన్నారు. ఎన్నికల ప్రచారానికి ర్యాలీకి రాలేదని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వచ్చామన్నారు.

ఒకప్పుడు అవినీతి చేసిన వాళ్లను బీజేపీ వాషింగ్ మెషిన్‌లో ఉతికి శుభ్రం చేసిందని చురకలు అంటించారు. అవినీతిపరులతోనే ఉన్న పార్టీ... ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుంది? అని ఠాక్రే ప్రశ్నించారు. జైళ్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లకు మద్దతునిచ్చారు. సునితా కేజ్రీవాల్, కల్పనా సోరెన్ లకు మద్దతుగా.. వారి అన్న ఇక్కడ ఉన్నాడని వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed