కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Dishanational4 |
కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : సీఎం పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడంతో ఢిల్లీలో పాలన గాడి తప్పిందంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోరాలతో కూడిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తిరస్కరించింది. అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అరెస్టయిన తర్వాత కూడా సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనేది పూర్తిగా కేజ్రీవాల్‌ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ అంశంపై రాష్ట్రపతి లేదా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ను సంప్రదించాలని పిటిషనర్‌ విష్ణు గుప్తాకు హైకోర్టు సూచించింది. కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలని.. కానీ అది కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయమని న్యాయస్థానం తెలిపింది. ఇది న్యాయస్థానం అని.. కోర్టులు ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన గానీ.. గవర్నర్‌ పాలన గానీ విధించిన సందర్భాలు ఉన్నాయా అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.

లెఫ్టినెంట్ గవర్నర్ ముందుకు తీసుకెళ్తా : పిటిషనర్

‘‘సీఎం అరెస్ట్ కావడంతో ఢిల్లీలో ప్రభుత్వం పనిచేయడం లేదని మేం ఎలా చెప్పగలం ? అది నిర్ణయించడానికి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు పూర్తి సామర్థ్యం ఉంది. అలాంటి లెఫ్టినెంట్ గవర్నర్‌కు మేం మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. చట్టం ప్రకారం ఏం చేయాలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తారు’’ అని న్యాయస్థానం బెంచ్ వ్యాఖ్యానించింది. పిటిషన్‌ను కొట్టి వేయడంతో విష్ణు గుప్తా తన పిల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు. ఇక ఇప్పటికే కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ మార్చి 28న సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.



Next Story

Most Viewed