ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు బీజేపీ ప్రయత్నాలు: ఆప్ ఎమ్మెల్యేల ఆరోపణలు

by S Gopi |

కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఎమ్మెల్యే మదన్ లాల్ అన్నారు.

ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు బీజేపీ ప్రయత్నాలు: ఆప్ ఎమ్మెల్యేల ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దేశ రాజధానిని రాష్ట్రపతి పాలనలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు ఆప్ శాసనసభ్యులు సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆరోపణలు చేశారు. ఢిల్లీలో రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రపతి పాలన విధించే ప్రయత్నాలపై చర్చ సందర్భంగా కస్తూర్బా నగర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే మదన్ లాల్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి ఉంది. ఇక్కడ లెఫ్ట్‌నెట్ గవర్నర్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు అనుమతించబోమని అంటున్నారని వెల్లడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ఏ చట్టం అడ్డురాలేదని ఆప్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఆప్‌ను భయపెట్టేందుకు ఢిల్లీలో రాష్ట్రపతి పాలనపై పుకార్లు సృష్టిస్తున్నారాని మదన్ లాల్ ఆరోపించారు. మరో ఆప్ ఎమ్మెల్యే బీఎస్ జూన్ మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తామంటూ కొందరు భయాందోళనలు సృష్టిస్తున్నారని, ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం లేదని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ను నకిలీ కేసులో అరెస్ట్ చేశారని, బీజేపీ ఒత్తిళ్లకు ఆప్ లొంగదని, ఆయనే తమ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మోడల్ టౌన్ ఎమ్మెల్యే అఖిలేష్ పతి త్రిపాఠి వెల్లడించారు.

Next Story