కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ మంత్రి రాజీనామా

by Dishanational4 |
కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ మంత్రి రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలోని ఓ మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవికి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ రాజీనామా చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా ప్రకటించారు. ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఇప్పుడు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని రాజ్‌కుమార్‌ ఆనంద్‌ విమర్శించారు. ఈ పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం తనకు సముచితంగా అనిపించడం లేదని ఆయన ప్రకటించారు. అవినీతిపరులతో తన పేరు ఉండకూడదని భావిస్తున్నట్లు వెల్లడించారు. ‘‘రాజకీయాలు మారితే దేశం మారిపోతుందని గతంలో అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ నుంచి పిలుపునిచ్చారు. రాజకీయాలు మారలేదు. కానీ రాజకీయ నాయకుడు(కేజ్రీవాల్) మారాడు’’ అంటూ రాజ్‌కుమార్‌ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాను. అయితే ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ ఆనంద్ రిజైన్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజీనామా నిర్ణయాన్ని రాజ్ కుమార్ స్వతహాగా తీసుకున్నారా ? కేజ్రీవాల్ ప్రత్యర్థులతో చేరిపోయి రాజ్ కుమార్ రాజీనామా చేశారా ? అనే దానిపై ఆప్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed