కుల దురహంకారం.. కోయంబత్తూర్‌లో ‘నారప్ప’ సీన్ రిపీట్

by  |
కుల దురహంకారం.. కోయంబత్తూర్‌లో ‘నారప్ప’ సీన్ రిపీట్
X

దిశ, వెబ్‌డెస్క్: దళితుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు, రిజర్వేషన్లు, గౌరవ హోదాను కల్పిస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కుల దురహంకార చర్యలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో వెలుగుచూసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఓ ప్రభుత్వ దళిత ఉద్యోగిని అత్యంత దారుణంగా అవమానపరిచాడు ఓ వ్యక్తి.

కోయంబత్తూర్ జిల్లా అన్నూర్ పంచాయతీలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ముత్తుస్వామి (దళితుడు)ని ఇదే గ్రామానికి చెందిన గోపాల్‌ స్వామి అనే వ్యక్తి కులం పేరుతో దూషించాడు. అంతటితో ఆగకుండా తనకున్న పలుకుబడితో ఉద్యోగం నుంచి తీసేయిస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు ముత్తుస్వామి.. గోపాల స్వామి కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పాడు. (నారప్ప సినిమాలో ఓ వర్గానికి చెందిన వ్యక్తుల కాళ్లను వెంకటేశ్ మొక్కినట్టే మొక్కాడు). కాళ్ల మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించినా గోపాల స్వామి మొండి వైఖరి ప్రదర్శించాడు.

ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారం కాస్తా బయటకు రావడంతో జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భారత రాజ్యాంగంలో దళితులపై ఇంత చిన్న చూపు ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు. గోపాల స్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story