నష్టాల ఊబిలో డిస్కంలు.. అప్పులు పుట్టడం కష్టమే!

by  |
telangana Electricity Department
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు అప్పుపుట్టడం కష్టతరం కానుంది. ప్రతి ఏటా డిస్కంలు నష్టాల ఊబిలోకి కూరుకుపోవడటమే ఇందుకు కారణంగా మారింది. అంతేకాకుండా రేటింగ్‌లోనూ లేక దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలు వెనుకబడ్డాయి. లాభాల్లో ఉన్న సంస్థలకే రుణాలు అందించాలనే ప్రతిపాదన ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టింది. దీనికోసం కార్పొరేట్ గవర్నెన్స్ గైడ్ లైన్స్ అనే విధానాన్ని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించింది. సరైన గ్రేడింగ్ ఉండి, సంస్థ లాభాల్లో ఉంటేనే రుణాలు అందించాలనే నూతన నిబంధనను తీసుకొచ్చింది. దాని ప్రకారం భవిష్యత్‌లో మన సంస్థలకు అప్పులు పుట్టడం మరింత కష్టం కానుంది. పార్లమెంట్ వేదికగా కార్పొరేట్ గవర్నెన్స్ గైడ్ లైన్స్ అనే విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డిస్కంలకు అప్పులిచ్చే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్ సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ల(ఆర్ఎఫ్ సీ)కు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పలు సలహాలు, సూచనలు చేసింది. లోన్లకు సంప్రదించే విద్యుత్ సంస్థల రేటింగ్, లాభాల్లో సాగుతోందా, నష్టాల్లో ఉందా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి కానీ ఇవ్వకూడదనే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

నష్టాల్లోనే డిస్కంలు

తెలంగాణలోని విద్యుత్ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. పార్లమెంట్‌లో కేంద్రం విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా ప్రతి ఏటా నష్టాలు చవిచూసి అప్పులపాలైంది. 2014-15 లో రూ.2513 కోట్లు, 2015-16లో రూ. 3380 కోట్లు, 2016-17లో రూ.6202 కోట్లు నష్టాల్లో ఉన్నాయి. 2017-18లో ఈ నష్టాలు కొంచెం తగ్గి రూ.5485 కోట్లకు చేరుకున్నా 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈ నష్టాలు ఘోరంగా పెరిగిపోయాయి. ఏకంగా రూ.8019 కోట్లకు చేరుకుంది. 2019-20 నాటికి కాస్త తగ్గి రూ.6057 కోట్లకు చేరుకుంది. 2015 నుంచి ఉదయ్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు నష్టాల కారణంగా మరింత అప్పులపాలైంది.

క్లారిటీ లేని లెక్కలు

డిస్కంల నష్టాలపై పార్లమెంట్ వేదికగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ఒకలా ఉంటే, నీతి అయోగ్ ఇచ్చిన నివేదిక మరోలా ఉంది. ఈ రెండు నివేదికల లెక్కల్లో క్లారిటీ లేకుండా పోయింది. లెక్కలు సరిపోలకపోవడం పక్కన పెడితే తప్పులతడకగా ఉండటం వాటి పనితీరుకు నిదర్శనంగా మారింది. పార్లమెంట్ ఇచ్చిన నివేదికలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎన్పీడీసీఎల్ నష్టాలు రూ.1343 కోట్లు, ఎస్పీడీసీఎల్ నష్టాలు రూ.1171 కోట్లుగా మొత్తం రూ.2513 కోట్లుగా ఉంది. నీతి అయోగ్ ఇచ్చిన రిపోర్ట్‌లో మాత్రం రూ.2912 కోట్ల నష్టాల్లో డిస్కంలు ఉన్నట్లు వెల్లడించింది. 2015-16 లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదికలో డిస్కంల నష్టాలు రూ.3380 ఉంటే నీతి అయోగ్‌లో రూ.3674 కోట్లుగా ఉంది. 2016-17లో రూ.6202 కోట్లు ఉంటే నీతి అయోగ్ లో రూ.6209 కోట్లుగా ఉంది. 2017-18లో రూ.5485 కోట్లు ఉంటే, నీతి అయోగ్ నివేదికలో రూ.6387 కోట్లుగా ఉంది. 2018-19లో రూ.8019 కోట్ల నష్టం ఉందని వెల్లడిస్తే, నీతి అయోగ్ లో రూ.9029 కోట్ల నష్టం ఉందని వెల్లడించింది. ఈ నష్టాల్లో భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం.

యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లయ్(ఏసీఎస్), యావరేజ్ రెవెన్యూ రిలీజ్ డ్(ఏఆర్ఆర్) గ్యాప్ ను చూసుకుంటే 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి నుంచి 2018-19 నాటికి క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2014-15 లో రూ.0.46 పైసలు ఉండగా క్రమంగా రూ.0.94 పైసలకు, రూ.1.23 పైసలకు పెరిగింది. కాగా 2017-18 లో మాత్రం రూ.1.17 పైసలకు తగ్గింది. అనంతరం 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.1.45 పైసలకు చేరుకుంది.

2018-19 ఆర్థిక సంవత్సరానికి నాటికి తెలంగాణలోని డిస్కంలకు ఏర్పడే విద్యుత్ లీకేజీల నష్టం 20 శాతంగా ఉన్నట్లు నీతి అయోగ్ నివేదికలో పేర్కొంది. బిల్లింగ్ విధానం 93.9 శాతంతో మెరుగ్గా ఉండగా వసూళ్లు 85.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఒక కిలోవాట్ విద్యుత్ కొనుగోలుకు రూ.5.81 ఉండగా కిలోవాట్ విద్యుత్ సరఫరాకు రూ.6.99 ఉన్నట్లుగా వెల్లడించింది. విద్యుత్ కొనుగోళ్ల ద్వారా కిలోవాట్ కు రూ.4.23 పైసలు వస్తున్నట్లు పేర్కొంది. డిస్కంలు పొందుతున్న టారిఫ్ సడ్సిడీ మాత్రం రూ.0.92 పైసలుగా ఉంది. సర్దుబాటు చేసిన ఏఆర్ఆర్ రూ.5.55 పైసలుగా ఉంది. ఏసీఎస్-ఏఎస్ ఆర్ మధ్య గ్యాప్ రూ.1.44 పైసలుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2019 లో ఎన్పీడీసీఎల్ నష్టాలు రూ.3051 కోట్లుంటే, బిల్లింగ్ విధానం 90 శాతం, వసూళ్లు 79 శాతం, విద్యుత్ లీకేజీల నష్టాలు 29 శాతంగా ఉన్నాయి. ఎస్పీడీసీఎల్ రూ.4967 కోట్లు నష్టాల్లో ఉంది. బిల్లింగ్ విధానం 96 శాతం ఉండగా, వసూళ్లు 88 శాతం, లీకేజీల నష్టాలు 16 శాతంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.



Next Story

Most Viewed