పబ్ జీ.. పనైపోయినట్లేనా?

by  |
పబ్ జీ.. పనైపోయినట్లేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయని అనుమానాలున్న 250కిపైగా చైనా యాప్‌ల జాబితాను కేంద్రం సిద్ధం చేసింది. ఇందులో అలీబాబా గ్రూపునకు చెందిన యాప్‌లతో పాటు ప్రముఖ గేమింగ్ యాప్ ‘పబ్ జీ’ కూడా ఉంది. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్రం గత నెల 29న ప్రకటించింది. అయితే తాజాగా మరో 47 యాప్‌లపై కేంద్రం కొరడా ఝలిపించింది. దీంతో డ్రాగన్ దేశానికి చెందిన మొత్తం 106 యాప్స్ ప్రస్తుతం నిషేధిత లిస్టులో చేరాయి. మిగతా చైనా యాప్స్‌పై సమగ్ర పరిశీలన అనంతరం ‘పబ్ జీ’తో పాటు వాటిపై కూడా వేటు వేస్తుందని సమాచారం. అయితే ఈ నేపథ్యంలో ‘పబ్ జీ’ గేమ్ ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఆ గేమ్ వల్ల కలిగిన పర్యవసానాలేంటో తెలుసుకుందాం.

పబ్‌ జీ (ప్లేయర్ అన్​నోన్ బాటిల్​గ్రౌండ్స్​) వీడియో గేమ్​ 2017 డిసెంబర్‌లో లాంచ్ అయింది. విడుదలైన ఏడాది కాలంలోనే అప్పటివరకున్న అన్ని గేమింగ్‌ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన ఈ గేమ్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించింది. ఈ క్రమంలో ఒక్క ఇండియాలోనే 175 మిలియన్ల డౌన్‌లోడ్లు సాధించడం విశేషం. సౌత్ కొరియాకు చెందిన వీడియో గేమ్ కంపెనీ ‘బ్లూ హోల్’ డెవలప్ చేసిన పబ్ జీలో చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ ‘టెన్సెంట్’ అధికమొత్తంలో షేర్ కలిగి ఉంది. ‘బాటిల్ రాయలే’ అనే జపాన్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఈ గేమ్‌ను అభివృద్ధి చేశారు. ఈ గేమ్‌ను కేవలం మొబైల్‌లోనే ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేశారు. అయితే ఎన్నో అవార్డులతో పాటు లెక్కలేనన్ని రికార్డులను సొంతం చేసుకున్న ఈ గేమ్‌ అంతే స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంది. అయితే ఇంతగా ఈ గేమ్‌కు అడిక్ట్ అవడానికి కారణం.. అందులో ఉన్న ఇంటెన్స్‌‌‌‌ గేమ్‌‌‌‌ ప్లే. తనను తాను కాపాడుకోడానికి ఇతరులను చంపడం, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం. అందులోనూ బాయ్స్‌కు గన్స్ అంటే.. తెలియని ఆకర్షణ కూడా ఓ కారణమే.

విమర్శలు..

ఆన్‌లైన్‌లో ఎన్నో వీడియో‌గేమ్స్ ఉన్నప్పటికీ.. పబ్‌జీ‌కి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ.. ఈ గేమ్‌కు అడిక్ట్ అయిపోయారు. చదువులు పక్కన పెట్టేసి, కాలేజ్‌లకు బంక్ కొట్టేసి, ఇంట్లో వాళ్ల మాట వినకుండా.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా.. గంటలకొద్దీ పబ్‌జీ లోకంలో మునిగిపోతున్నారు. దీంతో పబ్‌జీ గేమ్.. పిల్లలు, యువత ఆరోగ్యం‌పైన వ్యతిరేక ప్రభావం చూపుతోందని, పబ్‌ జీ బారినపడిన ఎంతోమంది చిన్నారులు మానసికంగా కృంగిపోతున్నారని, చదువుపై శ్రద్ధవహించలేని పరిస్థితి నెలకొందని ఎంతోమంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయలులు వాపోయారు. పబ్ జీ బ్యాన్ చేయాలంటూ.. పలు రాష్ట్రాల్లో వినతి పత్రాలు కూడా సమర్పించారు.

ఆత్మహత్యలు.. లక్షల రూపాయల ఖర్చు :

పబ్‌జీ ఆడొద్దన్నంటుందుకు చాలా చోట్ల యువకులు, చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఓ యువకుడిని పబ్ జీ ఆడొద్దని చెప్పినందుకు తన తండ్రినే అతి దారుణంగా హతమార్చాడు. చివ‌ర‌కు ఆ తండ్రి శవం ప‌క్క‌నే రాత్రంతా గేమ్ ఆడాడు. అంతేకాదు పబ్‌ జీ వల్ల కొంతమంది కుర్రాళ్లు ఉన్మాదుల్లా తయారుకాగా, మరికొందరు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇటీవలే ఓ టీనేజ్‌ కుర్రాడు ఈ గేమ్‌ కోసం దొంగగా మారాడు. ఏకంగా తన తండ్రి అకౌంట్‌ నుంచి రూ.16 లక్షలు కాజేసి ఖర్చుచేశాడు. పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్‌లో తుపాకులు, గ్రనేడ్లు, హెల్త్ కిట్లు వంటివి ఎంత ఎక్కువగా ఉంటే.. అంత సమర్థంగా శత్రువుపై దాడి చేసి ప్లేయర్ విక్టరీ సాధించవచ్చు. అయితే ఇలాంటి ఉపకరణాలు ఉచితంగా లభించవు. వాటిని కొనాలంటే డబ్బు చెల్లించాలి. వీటి కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా.. ఓ వైపు ఆత్మహత్యలు, మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపడంతో పాటు అన్నింటిపై నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించడం వల్లే దీన్ని బ్యాన్ చేయాలని సర్వత్రా కోరుకుంటున్నారు.

అక్కడ బ్యాన్..

పబ్ జీ గేమ్‌ను ‘యాంటీ ఇస్లాం’గా పేర్కొంటూ పాకిస్తాన్ ఇటీవలే ఈ గేమ్‌పై నిషేధం విధించింది. అయితే రెండు రోజుల క్రితమే మళ్లీ ఈ నిషేధాన్ని ఎత్తేసింది. గుజరాత్‌లోని సూరత్ జిల్లాలోనూ పబ్‌జీపై నిషేధం కొనసాగుతుండగా.. ఈ ఏడాదిలో గుజరాత్ కూడా స్కూళ్లలో పబ్ జీ గేమ్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గతంలో జమ్మూ కశ్మీర్ విద్యార్థుల అసోసియేషన్ కూడా పబ్ జీ గేమ్ నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. డ్రగ్స్ కంటే కూడాను పబ్ జీ గేమ్ ఎంతో డేంజర్‌ అని స్టూడెంట్స్ అసోసియేషన్ తమ లేఖలో తెలిపింది. రోజు రోజుకూ ఈ ఆటపై ఉన్న పిచ్చితో యువత విలువైన సమయాన్ని వృథా చేస్తూ.. వారి భవిష్యత్తును పాడు చేసుకుంటుందని, వారిపై చెడు ప్రభావాన్ని కలుగజేస్తుందని నేపాల్ ప్రభుత్వం ఇదే తరహాలో నిషేధించిన విషయం తెలిసిందే.

దేశ భద్రత విషయమనే కాదు.. పబ్ జీ గేమ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని ద‌ృష్టిలో పెట్టుకున్నా.. ఈ గేమ్‌ను నిషేధించడం సబబనే భావించాలి.

Next Story

Most Viewed