సక్సెస్‌ఫుల్ జర్నీ.. కశ్మీర్ టు అరుణాచల్

by  |
Shakuntala
X

దిశ, ఫీచర్స్: ఈ-తరం మహిళలు.. ఆకాశమే హద్దుగా వివిధ రంగాల్లో రాణిస్తూ విజయపతాక ఎగురవేస్తున్నారు. ఇక ముందుతరం మహిళల విషయానికొస్తే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లతో పాటు స్వాతంత్ర్య సంగ్రామంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటూ ప్రతీ రంగంలో తమ సత్తా చాటారు, చాటుతూనే ఉన్నారు. అంతేకాదు పురుషులకు మాత్రమే సాధ్యమని భావించే సివిల్ ఇంజినీరింగ్ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా సివిల్ రంగంలో మరుగునపడ్డ భారత తొలి మహిళా సివిల్ ఇంజినీర్ ప్రతిభ గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 69 బ్రిడ్జిలు నిర్మించిన ఆమె.. భారత్‌లోనే కాక బ్రిటన్, అమెరికా, జర్మనీలో 200 బ్రిడ్జిలకు డిజైన్ అందించారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

ముంబైకు చెందిన బ్రిడ్జి ఇంజినీర్ ఎస్.బీ జోషి కూతురు శకుంతల ఏ. భగత్ భారత తొలి మహిళా సివిల్ ఇంజినీర్‌గా చరిత్రలో నిలిచిపోయింది. చిన్నప్పటి నుంచి తండ్రి వద్ద సివిల్ ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ టెక్నిక్స్ గురించి తెలుసుకున్న శకుంతల.. ఆ తర్వాత కాలంలో ముంబై వీరమాత ‘జీజాబాయి టెక్నాలజికల్ ఇన్‌స్టిట్యూట్’లో సివిల్ ఇంజినీరింగ్ చదివింది. అప్పటికే బ్రిడ్జి కన్‌స్ట్రక్షన్స్‌పై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తను, యూఎస్ పెన్‌స్లైవియా యూనివర్సిటీలో సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత తన రీసెర్చ్ స్టడీస్‌ను విద్యార్థులకు బోధించాలన్న ఉద్దేశంతో ముంబై ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అయింది. ఈ క్రమంలో మెకానికల్ ఇంజినీర్ అనిరుధ ఎస్.భగత్‌ను పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో దంపతులిద్దరూ కలిసి బ్రిడ్జి కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన సూపర్‌స్ట్రక్చర్స్, స్టాండర్‌డైజ్డ్ పార్ట్స్ డిజైన్లను రూపొందించి ‘క్వాడ్రికాన్(Quadricon)’ పేరిట కన్‌స్ట్రక్షన్ సంస్థను స్థాపించారు. అలా స్పెసిఫిక్ డిజైన్స్‌తో అనేక బ్రిడ్జిలు నిర్మించారు. హిమాలయాల ప్రాంతంలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న స్టీల్ బ్రిడ్జిలు క్వాడ్రికన్ ఆధ్వర్యంలో నిర్మించినవే.

అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాల్లో నిర్మాణ రంగంలో పని చేసిన శకుంతల.. కాంక్రీట్ సిమెంట్ గురించి రీసెర్చ్ చేసింది. ఆయా దేశాల్లో జరుగుతున్న వంతెనల నిర్మాణాలను పరిశీలించి అలాంటివి భారత్‌లోనూ నిర్మించాలని భావించింది. కాంక్రీట్ అసోసియేషన్ ఆఫ్ లండన్, ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌లో మెంబర్‌గా ఉంటూ ఇన్నోవేటివ్ థాట్స్‌పై చర్చలు జరిపేవారు. ఈ క్రమంలోనే క్వాడ్రికాన్ సంస్థ 1972లో హిమాచల్ ప్రదేశ్‌లోని స్పిటిలో తొలి బ్రిడ్జిని 4 నెలల్లో నిర్మించింది. అది సక్సెస్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. క్రమంగా కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు క్వాడ్రికాన్ ఆధ్వర్యంలో మొత్తం 69 బ్రిడ్జిలు నిర్మించారు.

క్వాడ్రికాన్ ఇన్నోవేషన్స్

స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో జాయింట్స్ కనెక్టింగ్ కోసం క్వాడ్రికాన్ న్యూ డివైస్ రూపొందించింది. యునీషియర్ కనెక్టర్(Unishear Connector) అనే పరికరం ద్వారా బ్రిడ్జి నిర్మాణంలో స్టీల్ స్ట్రక్చర్స్ జాయింటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని రూపొందించినందుకు గాను ఇన్వెన్షన్ ప్రమోషన్ బోర్డు శకుంతల దంపతులను ఇన్నోవేటివ్ అవార్డుతో సత్కరించింది. శకుంతల దంపతులు ఇప్పటిదాకా మొత్తం 200 క్వాడ్రికన్ స్టీల్ బ్రిడ్జిలకు డిజైన్లు అందించారు. అయితే బ్రిడ్జి నిర్మాణాలకు ప్రభుత్వ శాఖల సహకారమున్నప్పటికీ శకుంతల దంపతులు వారి వ్యక్తిగత శ్రమ, నమ్మకంతోనే ముందుకు సాగి అనుకున్న స్థాయిలో నిర్మాణాలు చేశారు. ఈ క్రమంలో 1993లో ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న శకుంతల 2012లో మరణించారు.

Next Story

Most Viewed