డిగ్రీ పట్టాలు.. కుక్కను పట్టుకునేందుకా?

by  |
డిగ్రీ పట్టాలు.. కుక్కను పట్టుకునేందుకా?
X

దిశ, వెబ్‌డెస్క్ :

కరోనాతో ఉపాధి రంగం విలవిల్లాడుతోంది. లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది తమ ఉపాధిని కోల్పోయారు. ఎన్నో సంస్థలు దుకాణాలు ఎత్తేశాయి. మరెన్నో సంస్థలు.. తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. క్రమక్రమంగా ఉద్యోగాలు ఊడుతూనే ఉన్నాయి. నిరుద్యోగిత రేటు పెరుగుతూనే ఉంది. ఇలాంటి సయమంలో ఐఐటీ ఢిల్లీ యూనివర్సిటీ ఇచ్చిన ఓ ఎంప్లాయ్‌మెంట్ యాడ్.. నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. జాబ్ వేకెన్సీ ప్రకటన వస్తే నిరుద్యోగులు సంతోషపడి అప్లయ్ చేస్తారు కానీ, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం.

ఇటీవలే ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో కుక్కను చూసుకునేందుకు ‘డాగ్ హ్యాండ్లర్’ కావలెను అనే ప్రకటన వెలువడింది. ఇది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం. అయితే, ఈ ఉద్యోగం చేసేవారికి శాలరీ మాత్రం.. నెలకు అక్షరాల 45 వేల రూపాయలు. ఢిల్లీ పోలీసుల శాలరీతో పోల్చుకుంటే.. ఓ పది, ఇరవై వేలు ఎక్కువే. ఇక ఎలిజిబిలిటీ విషయానికొస్తే.. ఎన్నో సర్వీస్ -సెక్యూరిటీ ఉద్యోగాలు 10+2 అర్హత ఉంటే సరిపోతుందని చెబుతాయి. కానీ, ఢిల్లీ ఐఐటీ మాత్రం.. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్ లేదా ఈక్వలెంట్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టాలు పొందిన వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులని ప్రకటించింది. అంతేకాదు.. అతనికి ఓ కారు కూడా ఉండాలనే నిబంధన విధించింది. కుక్కను క్యాంపస్ నుంచి వెటర్నరీ క్లినిక్ తీసుకెళ్లేందుకు కారు తప్పనిసరి. అతడి వయసు 21-35 ఏళ్ల మధ్యలో ఉండాలి. కుక్కకు వ్యాక్సిన్లు ఇప్పించాలి. స్టెరిలైజేషన్, మెడికల్ నీడ్స్ కోసం ఎక్సెల్ షీట్స్ క్రియేట్ చేయాలి, పీపీటీ ప్రజెంటేషన్ రూపొందించాలి అన్నది ఆ ప్రకటన సారాంశం.

ఈ ప్రకటన చూసిన ఎంతోమంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి డిగ్రీ పట్టాలు తెచ్చుకున్నది కుక్కను పట్టుకునేందుకా? ఈ విద్యావ్యవస్థలో మార్పు రాదా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పెద్ద చదువులు చదివి, పబ్లిక్ పరీక్షలో ర్యాంకు తెచ్చుకుని, ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగం సంపాదించుకున్న సగటు ఉద్యోగి శాలరీ కన్నా.. ఎంతో ఎక్కువ ఇవ్వడం ఏంటని? నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఇండియాలో ఇంజనీరింగ్ డిగ్రీకి ఉన్న విలువ ఇది. డాగ్ హ్యాండ్లర్ కోసం మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్.. బీటెక్. ఈ ప్రకటన చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. అది కూడా ఓ పేరొందిన ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి రావడం నిజంగా సిగ్గు చేటు. షేమ్ ఐఐటీ ఢిల్లీ.. బడే బడే బాతే’ అంటూ డాక్టర్ సునీల్ పాఠక్ అనే నెటిజన్ అన్నారు. ‘కుక్కను పట్టుకోవడానికి బీటెక్ పట్టభద్రుడు కావాలా? నేను నవ్వాలా? జాలి చూపించాలా? అయితే, ఐఐటీయన్ కూడా రెడీగా ఉన్నాడు? ‘షేమ్ ఆన్ యూ’ ఇలా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

మనదేశంలో నాణ్యమైన విద్య అందించడమే గగనమైపోతోంది. ఏడాదికి కొన్ని లక్షల మంది చేతిలో పట్టాలు పట్టుకుని ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. కానీ.. లక్షల మందికి వందల్లో, వేలల్లో మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. తమ క్వాలిఫికేషన్‌కు తగ్గ ఉద్యోగాలు దొరక్కపోవడంతో ఏదో చిన్నపాటి ఉద్యోగంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ ప్యూన్ ఉద్యోగానికి.. పీహెచ్‌డీ స్కాలర్లు, ఎంటెక్ పట్టభద్రులు, ఇంజనీర్లు, ఎంబీఏ విద్యార్థులు అప్లయ్ చేస్తున్నారంటే.. నిరుద్యోగిత ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ప్రఖ్యాత ఇంజనీర్ ఇన్‌స్టిట్యూషనే.. ‘కుక్క’ను పట్టుకునేందుకు ఇంజనీరింగ్ పట్టభద్రుడు కావాలని యాడ్ ఇవ్వడం నిజంగా విద్యావ్యవస్థపై ఉన్న కాస్త నమ్మకం కూడా పోయేలా ఉంది.

అసలే దేశంలో రోజురోజుకీ నిరుద్యోగం పెరిగిపోతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని అంచనా వేయగా.. రాష్ట్రంలో నిరుద్యోగులు దాదాపు రెట్టింపయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జనవరిలో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉండగా, ప్రస్తుతం 9.1 శాతానికి పెరిగింది. ఇదే జాతీయస్థాయిలో 7.4 శాతంగా ఉన్నట్లు ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఈఐ)’ తెలిపింది. ఈ క్రమంలో హరియాణాలో నిరుద్యోగిత రేటు అత్యధికంగా 33.5 శాతంగా నమోదు కాగా, ఢిల్లీలో 13.8 శాతం, ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 5.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7 శాతం ఉన్నట్టుగా సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పట్టభద్రుల విలువ రోజురోజుకీ తగ్గిపోతున్న నేటి పరిస్థితులను చూస్తుంటే.. ‘బోడి చదువులు వేస్టు, మీ బుర్రంతా భోంచేస్తూ..’ అని ఓ కవి అన్న మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. పాఠాలతో, పట్టాలతో.. టాటాలు, బిర్లాలు కాలేరు ఎవ్వరూ అన్నది నిజమే అనిపిస్తోంది.


Next Story

Most Viewed