ఉమ్మడి కరీంనగర్ అతలాకుతలం.. వరద నీటిలో జన జీవనం

by  |
ఉమ్మడి కరీంనగర్ అతలాకుతలం.. వరద నీటిలో జన జీవనం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అకాల వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులను అతలాకుతలం చేశాయి. నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలతో పాటు పట్టణాలు కూడా నీట మునిగిపోయాయి. దీంతో జిల్లా ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు.

వరద ఉధృతి కారణంగా కరీంనగర్‌లోని సిరిసిల్ల రహదారి రోడ్డు కట్ అయింది. దీంతో సిరిసిల్ల మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. పద్మానగర్‌లోని పలు వీధులు కూడా నీట మునిగిపోయాయి. జగిత్యాల రహదారిలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జనజీవనం స్తంభించిపోవడంతో పాటు పార్క్ చేసిన వాహనాలు కూడా నీట మునిగిపోయాయి. సిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరద నీటిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి గంగుల కమలాకర్ నగరంలోని పలు వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద నీటితో మునిగిపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.

శాతవాహన యూనివర్సిటీ ప్రాంతం మీదుగా వచ్చిన వరద నీరు ఎస్సారెస్పీ కెనాల్‌లోకి చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాల కాలనీలు జలమయం అయ్యాయన్నారు. 50 ఏళ్లలో ఏనాడు లేనంతంగా భూ గర్భ జలాలు పెరగడంతో వరద నీరు భూమిలోకి పోయే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ఈ కారణంగానే లోతట్టు కాలనీలకు వరద నీరు వచ్చి చేరిందన్నారు.

హుజురాబాద్‌లో..

హుజురాబాద్ చిలుకవాగు పొంగిపొర్లుతుండటంతో పరకాల రహదారి మీదుగా నీరు ప్రవహిస్తోంది. అలాగే పలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. చెల్పూరు, జూపాక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. జమ్మికుంట పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీ మరోసారి నీట మునిగిపోయింది. పట్టణంలో వరద నీటిలో చిక్కుకున్న కాలనీలను మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ సందర్శించారు. కాలనీ వాసులకు టిఫిన్లను ఏర్పాటు చేసిన ఈటల రాజేందర్ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని కలిసి మాట్లాడారు.

సిరిసిల్లలో..

సిరిసిల్ల పట్టణం అంతా జలమయం అయిపోయింది. కలెక్టరేట్‌తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలన్నీ వరదలో చిక్కుకుపోయాయి. శాంతినగర్ వంటి లోతట్టు కాలనీలే కాకుండా సిరిసిల్లలోని ప్రధాన రహదారిపై కూడా వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో, సిరిసిల్లలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దాదాపు 24 గంటలకు పైగా సిరిసిల్ల పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

వేములవాడలో..

వేములవాడ మీదుగా ప్రవహిస్తున్న మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మూలవాగుపై నిర్మిస్తున్న కొత్త వంతెన కుప్పకూలిపోయింది. గతంలో కూడా నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కూలిపోవడం గమనార్హం. రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.



Next Story