నీటి సంక్షోభాన్ని పరిష్కరించిన వాటర్ షీరో..‘గజాల పాల్’

by  |
Gujarat Woman
X

దిశ, ఫీచర్స్ : ఏళ్లపాటు గుట్టను తవ్వి, రోడ్డు నిర్మించిన బిహార్ వాసి దశరథ్ మాంఝీ గురించి తెలిసిందే. ఇతని తరహాలోనే గుజరాత్‌కు చెందిన గజాల పాల్.. 675 నీటి వనరులను(కుంటలు, చెరువులు) సక్సెస్‌ఫుల్‌గా పునరుద్ధరించింది. ఓ సాధారణ మహిళకు ఇది ఎలా సాధ్యమైంది? చెరువులు, కుంటలు జలకళతో శోభాయమానంగా ఉండేందుకు ఏం చేసింది? ఇందుకు ఎవరి సహకారం తీసుకుంది? ఆ ప్రాంత రైతులు ప్రస్తుతం ఎన్ని పంటలు పండిస్తున్నారు? పూర్వం ఎన్ని పంటలు పండించేవారు? నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న 97 గ్రామాల్లోని 5 వేల కుటుంబాలను ఎలా రక్షించింది? వంటి విశేషాలు మీకోసం..

కచ్‌ జిల్లా, రాపర్ తాలూకాకు చెందిన రైతు రావ్జి తార్సి కోలి.. తన వ్యవసాయ క్షేత్రానికి సాగునీటి కోసం దగ్గరలోని చెరువును పరిరక్షించేందుకు చాలా శ్రమించాడు. కానీ అందులో వర్షాకాలంలో మాత్రమే నీళ్లుండేవి. దీంతో సాగునీటి వసతి కరువై.. ఆ ఏరియాలోని రైతులు, కూలీలు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడాది మొత్తంలో ఒక్క పంట సీజన్‌కు మాత్రమే వాళ్లకు పని ఉండేది. జీవనోపాధి కోసం గుజరాత్ నుంచి మైగ్రేట్ కావడం తప్పదని అనుకుంటున్న సమయంలో అహ్మదాబాద్‌కు చెందిన గజాల పాల్ అనే మహిళ.. సమెర్థ్(Samerth) అనే ఎన్జీఓ స్టార్ట్ చేసి, దాని ఆధ్వర్యంలో నీటి వనరుల పునరుద్ధరణకు పూనుకుంది. ఈ క్రమంలో వాటర్ క్రైసిస్ సమస్యకు సక్సెస్‌ఫుల్‌గా పరిష్కారం చూపింది.

గజాల పాల్.. 2001లో ‘సమెర్థ్’ అనే ఎన్జీఓను ప్రారంభించగా, అప్పటికే కచ్‌లో భయంకరమైన భూకంపాలు సంభవించాయి. పర్యావరణంతో పాటు భూసారం పూర్తిగా దెబ్బతిని నీటి వనరులు క్షీణించాయి. ఈ సమయంలో గజాల పాల్ ఆయా గ్రామాల పంచాయతీ సభ్యులతో సమావేశమైంది. ఇంటికి దగ్గర్లోనే చిన్న చిన్న కుంటలు నిర్మించాలనే ప్రతిపాదనలు చేసి, ఇందుకు స్థానికులు పని చేయాల్సి ఉంటుందని, వారికి కూలీ ఇచ్చేందుకు కూడా సిద్ధమని తెలిపింది. మొత్తంగా పైలట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామంలో నీటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్తులకు వివరించి కుంటల పునరుద్ధరణకు, గ్రౌండ్ వాటర్ స్టోరేజ్‌కు నీటి గుంతల తవ్వకాలు చేపట్టారు. చెరువుల రక్షణకు జలదూత్(వాటర్ వాలంటీర్)లను నియమించారు. ఏళ్ల కిందటి సంప్రదాయ దిగుడు బావుల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. హైడ్రలాజికల్ మ్యాపింగ్ ద్వారా నీటి వినియోగం, అవెలబిలిటీ గుర్తించారు. చెరువులు, బావులు ఇతర నీటి వనరులు సమృద్ధిగా ఏర్పడే ప్రదేశాల్లో చెత్త పడేయకుండా అవగాహన కల్పించారు. తద్వారా నీటిని భవిష్యత్తుకు పదిలపరిచే ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ముఖ్యంగా వర్షపు నీటిని నిల్వ చేసేందుకు చేపట్టిన నిర్మాణాల (ఇంటిపై భాగంలో రూఫ్ టాప్స్ ) ద్వారా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. కాగా స్థానికులు, పంచాయతీ సభ్యుల సహకారంతోనే ఈ నిర్మాణాలు చేపట్టగలిగి సక్సెస్ అయినట్లు చెప్పుకొచ్చింది గజాల.



Next Story

Most Viewed